అచ్చెన్నపై కేసా.. హవ్వా.. హవ్వా... మరీ జగన్ సంగతేంటీ: చంద్రబాబు విసుర్లు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఛీప్ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పాత గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడుపై కేసు పెట్టారని గుర్తుచేశారు. కావాలనే వేధించడం సరికాదు అని.. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
అచ్చెన్నాయుడిపై కేసు పెడితే జగన్ చేసిన అన్యాయానికి, అవినీతికి జీవితాంతం జైల్లో ఉండాలని చంద్రబాబు అన్నారు. జగన్కు బయట ఉండే అర్హత లేదన్నారు. విశాఖ మేయర్గా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై కూడా కేసు పెట్టారని తెలిపారు. ఇది అరాచకానికి పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
విశాఖకు ఒక శని పట్టిందని పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆ శనిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని చంద్రబాబు అన్నారు. రాజధానుల పేరుతో రాజకీయం చేస్తున్నారని ప్రజలు ఈ విషయం గమనించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఇప్పటికే జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఇక సమయం కోసం వేచి చూడటమే మిగిలిపోయిందని చెప్పారు.