అర్ధరాత్రి విశాఖలో.. చిట్టి మాము రౌడీ గ్యాంగ్ హల్చల్.. బర్త్ డే సెలబ్రేషన్స్ రచ్చ..
ఇటీవల విజయవాడలో రౌడీ గ్యాంగ్ వార్ రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా విశాఖపట్నంలో మరో రౌడీ గ్యాంగ్ బర్త్ డే పార్టీ పేరుతో హల్చల్ చేసింది. కరోనా టైమ్లో నిబంధనలను ఉల్లంఘించి మందు,విందుతో హంగామా చేసింది. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు ఆ రౌడీ గ్యాంగ్ బర్త్ డే పార్టీపై దాడులు చేసి అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నానికి చెందిన రౌడీ షీటర్ చిట్టిమాము(44) శనివారం(జూన్ 6) అర్ధరాత్రి తన గ్యాంగ్తో కలిసి ఓచోట పెద్ద ఎత్తున పార్టీ ప్లాన్ చేశాడు. ఈ పార్టీకి నగరంలోని ఇతర రౌడీ షీటర్స్,వారి అనుచరులు,బౌన్సర్లు వచ్చారు. పార్టీలో మందు,విందు,డ్యాన్సులతో హోరెత్తించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్దంగా ఎక్కువమందితో పార్టీ నిర్వహించడంతో టాస్క్ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
రంగంలోకి దిగిన పోలీసులు పార్టీపై దాడులు చేశారు. చిట్టిమాముతో పాటు పార్టీకి హాజరైన మరికొందరు రౌడీ షీటర్లు,వారి అనుచరులను అదుపులోకి తీసుకుని దువ్వాడ పోలీసులకు అప్పగించారు. పార్టీ జరిగిన ప్రదేశంలో భారీగా మద్యం,గంజాయి,రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ టాస్క్ఫోర్స్ డీఎస్పీ త్రినాథరావు ఈ ఘటనపై మాట్లాడుతూ.. విశాఖలో రౌడీల చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లు ఇకనైనా రౌడీయిజం మానుకుని బుద్దిగా ఏదైనా పని చేసుకుని బతకాలని సూచచించారు. అంతే తప్ప నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నగరంలో రౌడీ గ్యాంగ్లపై నిత్యం నిఘా ఉంటుందని.. ప్రజలు కూడా తమ దృష్టికి వచ్చే సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని విజ్ఞప్తి చేశారు.
కాగా,2018లో మహమ్మద్ ఖాసిం అనే ఓ రౌడీ షీటర్ను చిట్టిమాము గ్యాంగ్ హత్య చేసింది. గతంలోనూ అతనిపై పలు హత్య కేసులు ఉన్నాయి.