టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వైఎస్ జగన్
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. అలయన్స్ టైర్స్ కంపెనీ నెలకొల్పిన యూనిట్ను ప్రారంభించనున్నారు. ఈ యూనిట్- జపాన్కు చెందిన యోకహామా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందినది. దీనితో పాటు కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. మరి కొన్నింటిని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు విడుదల చేశారు.
ఈ ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. 10.20 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడినుంచి 10:40 నిమిషాలకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్లో గల అలయన్స్ టైర్స్ యూనిట్కు చేరుకుంటారు. మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు అక్కడే గడుపుతారు.
2,350 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నెలకొల్పింది యోకహామా సంస్థ. 1,152 కోట్ల రూపాయల పెట్టుబడులతో తొలి దశ యూనిట్ అచ్యుతాపురం సెజ్లో నెలకొల్పింది. ఇవ్వాళ్టి నుంచి టైర్ల తయారీని మొదలు పెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో యోకహామా సంస్థకు టైర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. తమిళనాడులోని తిరునెల్వేలి, గుజరాత్లోని దహేజ్లో ఇదివరకే రెండు యూనిట్లను నెలకొల్పింది. మూడో యూనిట్ను అచ్యుతాపురం సెజ్లో ఏర్పాటు చేసింది.
దీనితో పాటు ఇదే టైర్ల తయారీ యూనిట్ రెండోదశ విస్తరణ పనులకు వైఎస్ జగన్ భూమిపూజ చేస్తారు. ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పిడిలైట్ ఇండస్ట్రీస్, మేఘా ప్రూట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైనాప్టిక్స్ ల్యాబ్స్, స్టెరాక్స్ లైఫ్ సైన్సెస్, ఇషా రిసోర్సెస్, ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్, విన్విన్ స్సెషాలిటీ ఇన్సులైటర్స్ లిమిటెడ్ కంపెనీ యూనిట్ల నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు వైఎస్ జగన్ అచ్యుతాపురం నుంచి విశాఖపట్నం బయల్దేరి వెళ్తారు.
మధ్యాహ్నం 1.10 నిమిషాలకు మర్రిపాలెంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి చేరుకుంటారు. ఆయన కుమారుడు సూర్య వివాహం ఇటీవలే జరిగింది. ఈ వివాహ రిసెప్షన్కు పలువురు మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు హాజరయ్యారు. ఇవ్వాళ వైఎస్ జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. విశాఖపట్నం సౌత్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వాసుపల్లి గణేష్.. అనంతరం వైఎస్ఆర్సీపీలో చేరారు.