గాజువాకలో మటన్ వ్యాపారికి కరోనా .. మటన్ కొన్న వారి కోసం గాలింపు
చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఎప్పుడు, ఎవరు కరోనా బాధితులుగా మారతారో అర్ధం కాని పరిస్థితి అందర్నీ టెన్షన్ పెడుతుంది . ఇక తాజాగా ఏపీలో 304 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా అనూహ్యంగా కేసులు పెరగటానికి ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్ధనలే కారణం . ఇక తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో కుంచుమాంబ కాలనీలో కరోనా కలకలం చెలరేగింది. ఓ మటన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ కు వెళ్లి వచ్చిన మటన్ వ్యాపారి ఆ తర్వాత శ్రీకాళహస్తిలో జరిగిన ఒక మత సమ్మేళనంలో కూడా పాల్గొన్నాడని తేలింది. అయితే అక్కడికి వెళ్లి వచ్చిన వారిని టెస్ట్ లు చేయించుకోమని చెబుతున్నా వినకుండా తనకేం కాలేదని ఆరోగ్యంగా ఉన్నానని మటన్ దుకాణం తెరిచాడు. ఏకంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సదరు వ్యాపారి మటన్ విక్రయించాడు. ఇక నిన్న అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ రోజు అతని వద్ద మటన్ కొనుగోలు చేసినవారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే అతని వద్ద మాంసం కొనుగోలు చేసిన 14 మందిని గుర్తించినట్లు సమాచారం. ఇంకా ఎంత మంది మాంసం కొన్నారో వారి కోసం కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఏపీలో కరోనా వైరస్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు తాజాగా ఒక్క కొత్త కేసు మాత్రమే నమోదైంది. గుంటూరులో కొత్తగా ఈ కేసు నమోదైంది. ఈ స్థితిలో గాజువాకలో మరో కేసు బయటపడింది. ఇతని నుండి ఎంత మందికి ఇది వ్యాపించిందో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది .