Coronavirus: విశాఖపట్నం విమానాశ్రయంలో ముందుజాగ్రత్త చర్యలు: థర్మల్ స్క్రీనింగ్.. !
విశాఖపట్నం: ప్రాణాంతక వైరస్ భారత్లో వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖపట్నం విమానాశ్రయంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రత్యేకంగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్కు కేంద్రబిందువైన చైనా నుంచి నేరుగా విశాఖపట్నానికి ఇప్పటిదాకా ఏ ప్రయాణికుడు కూడా రాలేదని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నామని విమానాశ్రయం డైరెక్టర్ ఎం రాజకిశోర్ వెల్లడించారు.
సింగపూర్, మలేషియాల నుంచి..
విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకునే విదేశీ ప్రయాణికుల్లో అత్యధికులు దుబాయ్, సింగపూర్, మలేషియాల నుంచి వస్తుంటారని రాజకిశోర్ వెల్లడించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామని అన్నారు. 15 రోజుల్లో ఏ ఒక్కరు కూడా చైనా నుంచి నేరుగా విశాఖకు చేరుకోలేదని చెప్పారు. మిగిలిన నగరాలతో పోల్చుకుంటే.. చైనా నుంచి విశాఖపట్నానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుందని అన్నారు.
అడ్వైజరీ జారీ..
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు జారీ చేసిన ఆదేశాలను తాము అనుసరిస్తున్నామని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ప్రయాణికుల్లో అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, కరోనా వైరస్ గురించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ బ్యానర్ల, పోస్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే- వైరస్ వ్యాధి లక్షణాల గురించి ప్రయాణికులకు వివరిస్తున్నామని అన్నారు.