జనసేన.. రెంటికీ చెడిందా? పవన్ చేసిన పొరపాటు అదేనా? కమ్యూనిస్టులు, బీఎస్పీ దూరం?
విశాఖపట్నం: సాధారణంగా- రాజకీయ పార్టీలేవైనా ధర్నాలు గానీ, నిరసన ప్రదర్శనలు గానీ చేపడితే.. పనిలో పనిగా తమ బలాన్ని కూడా నిరూపించుకుంటుంటాయి. రాజకీయంగా ఉన్న తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి వాటిని ఓ ఆయుధంగా మలచుకుంటూ ఉంటాయి. పాలనుకులను బెంబేలెత్తిస్తుంటాయి. పవన్ కల్యాణ్ నేతృత్వం వహిస్తోన్న జనసేన పార్టీ స్థితిగతులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. లాంగ్ మార్చ్ పేరుతో పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపునకు మిత్రపక్షాలు కూడా స్పందించకపోవడం.. రాజకీయంగా పార్టీ బలహీన పడిందనే సంకేతాలను ఇవ్వకనే ఇచ్చినట్టయింది.
కమ్యూనిస్టులు, బీఎస్పీ దూరమైనట్టేనా?
మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలో దిగలేదు. కమ్యూనిస్టులు, బహుజనులను వెంట తెచ్చుకుంది. సీపీఎం, సీపీఐ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లతో పొత్తు పెట్టుకుంది. సీట్లను సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలో దిగింది. దాని ఫలితమేంటనేది ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేని అంశం. పవన్ కల్యాణ్ సహా జనసేన పార్టీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ అభ్యర్థులు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయారు. జనసేన ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జనసేనతో కమ్యూనిస్టులు, బీఎస్పీ నాయకులు మిత్రత్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా..
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. జనసేన పార్టీ చేపట్టిన తొలి ఆందోళన లాంగ్ మార్చ్. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరత ఏర్పడిందని, నిర్మాణ రంగం స్తంభించిపోయిందని ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాథిని కోల్పోయారనేది జనసేన పార్టీ ప్రధాన ఆరోపణ. దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారమంటూ లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చింది. వేలాదిమందితో విశాఖపట్నంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మహా ప్రదర్శనను నిర్వహించనుంది. ఈ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ స్వయంగా పవన్ కల్యాణ్ వైఎస్సార్ కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఆహ్వానించారు. తెలుగుదేశం, బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా నాయకులను ఆహ్వానించారు.
టీడీపీ ఒక్కటే
పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసినప్పటికీ.. సానుకూలంగా స్పందించింది మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక్కటే. బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, లోక్ సత్తాలేవీ పవన్ కల్యాణ్ కు మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు. మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం, బీఎస్పీ కూడా పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపునకు స్పందించకపోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కమ్యూనిస్టులు గానీ, బీఎస్పీ నాయకులు గానీ లాంగ్ మార్చ్ కు హాజరు కాకపోవడం పొత్తు పెట్టుకుని అయిదు నెలలు కూడా కాలేదు.. అంతలోనే తెగదెంపులా? అనే అనుమానాలను రేకెత్తించినట్టయిందని అంటున్నారు.
నిరసన ప్రదర్శనలంటే ముందుండే కమ్యూనిస్టులు కూడా..
పేదల పక్షపాతిగా, ధర్నాలు, ఆందోళనలకు కేరాఫ్ గా మారిన కమ్యూనిస్టు పార్టీలు కూడా లాంగ్ మార్చ్ కు హాజరు కాకపోవడం ప్రత్యేకించి చెప్పుకోదగ్గ అంశంగా పరిగణిస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రాతినిథ్యాన్ని వహించే పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అవి వామపక్షాలే. భవన నిర్మాణ రంగంలో సీపీఐ, సీపీఎం మద్దతుదారులు, సానుభూతిపరులు వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి అట్టడుగు వర్గ అసంఘటిత రంగానికి చెందిన కార్మికుల కోసం స్వయానా మిత్ర పక్షమైన జనసేన పార్టీనే రాష్ట్ర స్థాయి ఆందోళన నిర్వహిస్తుండగా.. దానికి డుమ్మా కొట్టడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం- పవన్ కల్యాణ్ బీజేపీని చేరదీస్తుండటమేననే అభిప్రాయాలు ఉన్నాయి.
పవన్ చేసిన పొరపాటు అదేనా?
తాను నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ ఆందోళనలో పాల్గొనాలని కోరుతూ కమ్యూనిస్టులు, బీఎస్పీ నాయకుల కంటే ముందుగా బీజేపీ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారని, అదే మిత్ర పక్షాల ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు. మిత్ర పక్షాలైన సీపీఎం, సీపీఐలను సంప్రదించకుండా.. ఏకంగా బీజేపీతో మంతనాలు సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీకి, వామపక్షాలకు ఉండే వైరం ఎలాంటిదో తెలిసిన విషయమే. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అలాంటి వైరం ఉండే బీజేపీ, వామపక్ష నేతలను దగ్గర చేయడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నించడమే పొరపాటని అంటున్నారు. ఫలితంగా- అటు బీజేపీకి, ఇటు కమ్యూనిస్టుల మధ్య జనసేన పార్టీ రెంటికీ చెడిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.