విశాఖలో జవాద్ తుఫాన్ సముద్రం విధ్వంసం మామూలుగా లేదుగా: ఆర్కే బీచ్ కోత..కుంగిన భూమి
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్ ప్రభావం మూడు రాష్ట్రాలపై పడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. బలహీనపడి వాయుగుండంగా మారిన జవాద్ తుఫాన్.. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ సముద్రం ఉగ్రరూపాన్ని దాల్చుతోంది. విధ్వంసాన్ని రేపుతోంది. అల్లకల్లోలంగా మారింది. భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఇవే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.
పలుచోట్ల రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ..
ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్ల తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలోని జగత్సింగ్ పూర్, కేంద్రపారా, మయూర్భంజ్, పూరి, కటక్, భద్రక్, బాలాసోర్, నవరంగ్పూర్ జిల్లాలపై ఈ వాయుగుండం తీవ్రత యధాతథంగా ఉంటుంది. పూరి వద్ద తీరాన్ని దాటే సమయం 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పూరి, జగత్సింగ్ పూర్లల్లో రెడ్ అలర్ట్, బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జాజ్పూర్, కటక్, ఖుర్దా, గంజాం, గజపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు.
ఆ రెండు రాష్ట్రాల్లో..
కోల్కత సహా పశ్చిమ బెంగాల్లోని దిఘా, దక్షిణ 24 పరగణ, మేదినిపూర్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాయుగుండం తీరానికి సమీపిస్తోన్న కొద్దీ సముద్రం పోటెత్తుతోంది. అలలు ఎగిసిపడుతున్నాయి.
తీర ప్రాంత గ్రామాలను అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించారు. సురక్షిత ప్రదేశానికి తరలించారు. జవాద్ తుఫాన్ను తీరాన్ని దాటనున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను రంగంలోకి రంగంలోకి దించారు.
ఆర్కే తీరం వద్ద సముద్రం అల్లకల్లోలంగా
ఏపీలో ఈ స్థాయి వాతావరణం లేదు. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయే తప్ప అవి బీభత్సాన్ని సృష్టించట్లేదు. సముద్రం మాత్రం అల్లకల్లోలంగా తయారైంది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలజడిని సృష్టిస్తున్నాయి. మీటర్ ఎత్తు మేరకు అలలు తీరాన్ని తాకుతున్నాయి. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. రామకృష్ణా బీచ్ వద్ద తీరం కోతకు గురైంది. రిటెయినింగ్ వాల్ ధ్వంసమైంది. పలు చోట్ల భూమి కుంగిపోయింది.
తీరానికి దూసుకొస్తోన్న రాకాసి అలలు..
ఇదివరకు బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు.. తాజాగా జవాద్ తుఫాన్ వల్ల ఏర్పడిన తాజా పరిణామాలతో సముద్రం శాంతంగా ఉండట్లేదు. భీతావహంగా మారుతోంది. బీభత్సాన్ని సృష్టిస్తోంది. వరుస అల్పపీడనాలతో కొద్దిరోజులుగా సముద్రం అల్లకల్లోలంగానే ఉంటోంది. రాకాసి అలలు శరవేగంతో తీరానికి చేరుకుంటోన్నాయి. ఫలితంగా- రిటెయినింగ్ వాల్ ధ్వంసమైంది. భూమి కుంగిపోయింది.
Recommended Video
200 మీటర్లకు పైగా కుంగిన భూమి..
రామకృష్ణా బీచ్ వద్ద 200 మీటర్లకు పైగా భూమి కోతకు గురి కావడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు స్థానికులు. భూమి కోతకు గురైన విషయాన్ని తెలుసుకుని పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు భూమి కోతకు గురైంది. అలాగే తీరం ఒడ్డునే ఉన్న వరుణ్ చిల్డ్రన్ పార్కులో భూమి కుంగిపోయింది. చీలి పోయింది.
సుమారుగు అడుగు మేర కుంగిపోయింది. సాధారణంగా ఉప్పాడ వంటి చోట్ల మాత్రమే తీరం కోతకు గురి కావడం చోటు చేసుకుంటుందని, దీనికి భిన్నంగా ఆర్కే బీచ్ వద్ద ఇలాంటి పరిస్థితి ఏర్పడటాన్ని బట్టి చూస్తే- సముద్రం ఏ స్థాయిలో అల్లకల్లోలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.