భూములు కొల్లగొట్టే దండుపాళ్యం బ్యాచ్ వస్తోంది.. విశాఖ వాసులూ జాగ్రత్త : కూన రవి కుమార్
శ్రీకాకుళానికి చెందిన టిడిపి నేత, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ కూన రవికుమార్ మూడు రాజధానుల ప్రకటనపై స్పందించారు. విశాఖ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆ ప్రాంత వాసులు స్వాగతిస్తుంటే కూన రవికుమార్ మాత్రం భూములు కొల్లగొట్టే దండుపాళ్యం బ్యాచ్ విశాఖకు వస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి పట్టిన జగన్ గ్రహణం పోవాలన్న కూన రవి కుమార్
విశాఖపట్టణం నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న సుదూరమైన తీర ప్రాంతమంతా జగన్, ఆయన కుటుంబసభ్యులు, ఆయన అనుచరుల హస్తాల్లోకి వెళ్లిపోతోందని, ప్రజలందరూ మేల్కొనాలని విజ్ఞప్తి చేస్తున్నానని టీడీపీ నేత కూన రవి కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ గ్రహణం పోవాలని ఆయన కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఇక్కడి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారంతా రోడ్డెక్కి జగన్ గో బ్యాక్ అని నినదించాలని కోరారు.
అది దండుపాళ్యం బ్యాచ్... భూములు కొల్లగొట్టే బ్యాచ్
విశాఖపట్టణం జిల్లా వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. దండుపాళ్యం బ్యాచ్ వస్తోంది.. పులివెందుల పంచాయతీ వస్తోంది.. మన ఆస్తులను, భూములను కొల్లగొట్టడం కోసం వాళ్లందరూ వస్తున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న విశాఖ పర్యటనకు జగన్ వస్తున్నారని, ‘దండుపాళ్యం బ్యాచ్ గో బ్యాక్', ‘పులివెందుల పంచాయతీ గో బ్యాక్', ‘జగన్ మోహన్ రెడ్డి గో బ్యాక్' అని నినందించాలని పిలుపు నిచ్చారు . ఇక విజయసాయి రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా విమర్శలు చేశారు కూన రవికుమార్.
విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగం చేసి ల్యాండ్ గ్రాబింగ్
విజయ్ సాయి రెడ్డికి ఏమి అర్హత ఉందంటూ రాజధానిపై మాట్లాడుతున్నారని రవి ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏంటని నిలదీశారు. ఏ అధికారంతో ప్రభుత్వ నిర్ణయాలను విజయసాయి ప్రకటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించిన కూన రవికుమార్ అధికార దుర్వినియోగం చేసి విశాఖలో ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో విశాఖలో సొంత ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు అన్న తేడాలేకుండా దోచుకుపోతున్నారని కూన రవికుమార్ మండిపడ్డారు.
పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ఒరిగేది ఏం లేదు అన్న టీడీపీ నేత
పరిపాలన వికేంద్రీకరణ చేయడంవల్ల వెనుకబడిన ప్రాంతాలకు ఏమి ఒరిగేది లేదని పేర్కొన్నారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేన, ధర్మాన ప్రసాదరావు సుదీర్ఘకాలంగా మంత్రులుగా పనిచేసిన శ్రీకాకుళం ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదని కూన రవికుమార్ ప్రశ్నించారు. మొత్తానికి విశాఖను దోచుకునే దండుపాళ్యం గ్యాంగ్ అంటూ కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి.