దసపల్లా భూముల గొడవేంటి? వాటి విలువెంత? విశాఖపట్నంలో ఏం జరుగుతోంది?
విశాఖపట్నం నగరం నడిబొడ్డున రూ.2వేల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాన్ వేశారు. వారికి అధికార యంత్రాంగం అండ ఉంది. వాస్తవానికి 22ఏ జాబితాలో ఉన్న ఈ భూముల కోసం 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పోరు సాగిస్తోంది.
దసపల్లా భూములంటే ఏంటి?
దసపల్లా రాజు వైరిచర్ల నారాయణగజపతిరాజుకు చెందిన భూములు. వాటిని ఆయన తన కుమార్తె రాణీ కమలాదేవి పేరున 1938లో వీలునామా రాశారు. ఎస్టేట్ అబాలిష్మెంట్ చట్టం అమల్లోకి రావడంతో అప్పటి అసిస్టెంట్ సెటిల్ మెంట్ అధికారి వాటికి గ్రౌండ్ రెంట్ పట్టా ఇచ్చారు. 1981లో దీనిపై అప్పటి తహశీల్దార్ కోర్టులో అప్పీలు చేయగా కమిషనర్ పట్టాను రద్దుచేసి అవి ప్రభుత్వానివేనని తేల్చారు.
2001లో వీటిని 22ఏ కింద చేర్చారు. విశాఖ టౌన్ సర్వేసంఖ్య 1196, 1197, 1027, 1028ల్లో మొత్తం 60 ఎకరాల భూములుండగా, వీటిలో 40 ఎకరాలను వీఎంఆర్డీఏ, నౌకాదళం, జీవీఎంసీ సేకరించాయి. మిగిలిన 20 ఎకరాల్లో 5 ఎకరాలను వివిధ అవసరాలకు కేటాయించారు. మిగిలిన 15 ఎకరాల చుట్టూనే వివాదం నడుస్తోంది.
ఎక్కడికి వెళ్లినా కమలాదేవికి అనుకూలమే..
సర్వేశాఖ జీవోను కమలాదేవి హైకోర్టులో సవాలు చేయగా తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసి 2014 వరకు న్యాయపోరు సాగించింది. సుప్రీంకోర్టులో సైతం రాణీ కమలాదేవికి అనుకూలంగా తీర్పు రావడంతో ప్రభుత్వం క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పుడూ తీర్పు కమలాదేవికి అనుకూలంగానే వచ్చింది.
అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం 2015లో ఈ భూములను మరోసారి 22ఎ కింద చేరుస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. తాజాగా దసపల్లా భూములను రాణీ కమలాదేవి నుంచి కొన్న 60మందితో వైసీపీ నేతలు డెవలప్మెంట్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.
విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ?
ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, సీపీఐ నాయకులు విశాఖపట్నంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన కుమార్తె, అల్లుడి పేరుమీద వీటిని కొట్టేస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ ర్యాలీలు, నిరసనలతో నగరాన్ని హోరెత్తించాయి.
వారి ఆరోపణల ప్రకారం.. విజయసాయిరెడ్డి బినామీ కంపెనీల పేరుతో ఈ 15 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించారని, వాటి ఛార్జీలకయ్యే డబ్బును తన కుమార్తె, అల్లుడి కంపెనీ నుంచి బినామీలకు పంపించారని, 22 ఏ కింద జాబితా నుంచి వాటిని స్వాధీనం చేసుకోబోతున్నారని ఆరోపిస్తున్నాయి.
డెవలప్ మెంట్ కు అగ్రిమెంటు కుదుర్చుకున్న కంపెనీ ''ఎస్యూర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎల్ఎల్పీ'' విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉమేష్, దుస్తుల వ్యాపారి గోపినాథ్రెడ్డిలకు చెందినదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ భూముల విలువ ప్రస్తుతం రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.