నాకు పిచ్చి లేదు- మందులు పడట్లేదు-ఆస్పత్రి మార్చండి- అధికారులకు డాక్టర్ సుధాకర్ లేఖ...
విశాఖ మానసిక రోగుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ కోలుకున్నట్లే కనిపిస్తోంది. తనకు మానసిక పరిస్ధితి సరిగాలేదంటూ ఆస్పత్రిలో చేర్చడం, అక్కడ ఇస్తున్న మందుల ప్రభావంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఆయన ఓ లేఖ రాశారు. అందులో ఆయన తనకు పిచ్చి లేదని, వెంటనే ఆస్పత్రి మార్చాలని కోరారు.
డాక్టర్ సుధాకర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కు రాసిన లేఖలో మాస్కుల కొరతపై తాను ప్రశ్నించడం దగ్గర నుంచి మానసిక ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందించడం వరకూ చోటు చేసుకున్న పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా మానసిక ఆస్పత్రిలో తనకు అందిస్తున్న వైద్యం గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసిన సుధాకర్.. తనకు మానసిక రోగికి ఇస్తున్న మందులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ మందుల వల్ల తనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సుధాకర్ ఆరోపించారు. మెంటల్ ఆస్పత్రిలో ఇస్తున్న మందుల వల్ల తన పెదవిపై వచ్చిన మార్పులను చూపిస్తూ ఫొటోలు కూడా విడుదల చేశారు.
తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో పేర్కొన్న సుధాకర్.. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు తలెత్తున్నట్లు వాపోయారు. యూరిన్ సమస్యలు కూడా వస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. కాబట్టి తనను వెంటనే సాధారణ ఆస్పత్రికి రిఫర్ చేయాలని సుధాకర్ తన లేఖలో ఆస్పత్రి సూపరింటెండెంట్ కు విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగానే ఉందని లేఖలో వివరించారు.