విశాఖ బయలుదేరిన దక్షిణకొరియా టీమ్- ఎల్జీపాలిమర్స్ పై సొంత దర్యాప్తు...!
విశాఖలో ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ లీకేజ్ తో 12 మంది ప్రాణాలను బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ పై దక్షిణకొరియాలోని దాని మాతృసంస్ధ ఎల్జీ కెమికల్స్ దర్యాప్తుకు సిద్ధమవుతోంది.
దక్షిణకొరియాలోని ప్రధాన కార్యాలయం నుంచి 8 మంది సభ్యుల బృందం ఇప్పటికే విశాఖకు బయలు దేరింది. రేపు లేదా ఎల్లుండి విచారణ బృందం ఎల్జీ పాలిమర్స్ కు చేరుకుంటుంది. గ్యాస్ లీకేజ్ కు దారితీసిన కారణాలు, పర్యావరణ అనుమతులు, ఇతర అంశాలపై సంస్దాగతంగా అంతర్గత దర్యాప్తు చేపట్టేందుకు ఎల్జీ కెమికల్స్ ఈ బృందాన్ని పంపుతోంది.
Recommended Video
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ మానవహక్కుల కమిషన్ దర్యాప్తు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఎల్జీ కెమికల్స్ సంస్ధ స్వతంత్ర దర్యాప్తుకు సిద్ధమైంది. గ్యాస్ లీకేజీకి గల కారణాలను విశ్లేషించడంతో పాటు భవిష్యత్తులో స్ధానిక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల బృందం సూచనలు, సలహాలు ఇవ్వబోతోంది. ఈ పర్యటనలో ఎల్జీ కెమికల్స్ బృందం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతోనూ భేటీ అయ్యే అవకాశముంది.