విశాఖ తీరంలో అక్రమ తవ్వకాలు-కేంద్రాన్ని తప్పుదోవ పట్టించి మరీ ? పర్యావరణ వేత్తల గగ్గోలు
ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.ముఖ్యంగా సాగర తీరంలో పరిమితికి మించి జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఇప్పుడు పర్యావరణ వేత్తలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. తీర ప్రాంత క్రమబద్ధీకరణ కోసం గతంలో కేంద్రం చేసిన చట్టాల్ని ఉల్లంఘించి మరీ జరుపుతున్న తవ్వకాలతో భవిష్యత్తులో సాగర తీరం రూపురేఖలు మారిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

విశాఖ తీరంలో అక్రమ తవ్వకాలు
విశాఖ తీరంలోని రుషికొండ వద్ద జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనుల్లో అడుగడుగునా నిబంధనలకు పాతర వేస్తున్నట్లు పర్యాటక ప్రేమికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల్లో తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరిమితికి మించి తవ్వేయడంతో తీర ప్రాంత వాతావరణం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న పనుల్లో తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి (సీఆర్జడ్) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

కేంద్రం అనుమతులకు భిన్నంగా
రుషికొండ వద్ద చేపట్టిన ఈ ప్రాజెక్టు సీఆర్జడ్ అనుమతులకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) దరఖాస్తు చేయగా కేంద్ర అటవీ పర్యావరణశాఖ గత ఏడాది మే 19న కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.
తాజాగా దీనికి సంబంధించిన నివేదికలోని అంశాలు బయటకు వచ్చాయి. ఆ అనుమతులకు భిన్నంగా క్షేత్ర స్థాయిలో పలు ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కేంద్ర అటవీ శాఖకు వాస్తవ సమాచారం ఇవ్వలేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

అనుమతించిన దానికంటే రెట్టింపు తవ్వకాలు
61 ఎకరాల మేర ఉన్న రుషికొండ 'హిల్ ఏరియా'లో 9.88 ఎకరాల్లో ప్రాజెక్టుకు ఏపీటీడీసీ అనుమతి తీసుకోగా, క్షేత్ర స్థాయిలో దీనికి రెండింతల తవ్వకాలు జరిగినట్లు కనిపిస్తోంది. కొండ మధ్యలో చిన్న భాగం తప్ప మిగిలిన అంతటా భారీగా తవ్వేశారు. శిఖర భాగాన్ని వదిలి చుట్టూ తవ్వకాలు జరిపారు. అటవీశాఖ 139 చెట్లు తొలగించినట్లు పేర్కొనగా... వందల సంఖ్యలో చెట్లను తొలగించినట్లు తెలుస్తోంది.
సీఆర్జడ్ అనుమతుల్లో భాగంగా వీఎంఆర్డీఏ (విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ) పేర్కొన్న మాస్టర్ప్లాన్ నిబంధనలు పాటించాలి. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేయడంలో కేంద్ర అటవీశాఖను తప్పుదోవ పట్టించినట్లు విమర్శలు వస్తున్నాయి. వివిధ రకాల అనుమతులకు మే నెలకు ముందే దరఖాస్తు చేసి ఆగస్టులో పనులు మొదలుపెట్టారు. అప్పటికి '2041 మాస్టర్ ప్లాన్' అమల్లోకి రాకపోవడంతో 2021 ప్లాన్ను ప్రాతిపదికగా తీసుకోవాలి. దీని ప్రకారం ఈ ప్రాంతం అటవీ సంరక్షణ పరిధిలోని సీఆర్జడ్ -1లో ఉంది. అంటే ఇక్కడ నిర్మాణాలకు వీలు కాదు. ఈ నేపథ్యంలో అమలులోకి రాని '2041 మాస్టర్ప్లాన్' ప్రకారం నిర్మాణాలకు వీలయ్యే సీఆర్జడ్-2 పరిధిలో చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కొత్త మాస్టర్ ప్లాన్ నవంబరు నుంచి అమల్లోకి వచ్చింది.

తీరానికి జరిగే నష్టమిదే
రుషికొండ వద్ద తవ్విన మట్టిని సముద్ర తీరంలో పలు చోట్ల డంపింగ్ చేయడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం తవ్వకాల ద్వారా వచ్చిన వాటిని నీటి వనరులు, పక్కనే ఉన్న ప్రదేశాల్లో వేయకూడదని నిబంధనలు చెప్తున్నాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక అంతకు ముందున్నట్లుగా ఆయా ప్రాంతాలు పునరుద్ధరించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా వేలాది టన్నుల గ్రావెల్ను సముద్ర తీరంలో పారబోశారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పేరుతో తీర ప్రాంత సహజత్వాన్ని పూర్తిగా దెబ్బతీశారు. లారీల్లో మట్టిని తరలించి చేపల తిమ్మాపురం నుంచి ఎర్రమట్టి దిబ్బల వరకు సుమారు పది కిలోమీటర్ల మేర తీరం వెంట పోశారు. అలాగే పలు చోట్ల పది అడుగుల ఎత్తు వరకు మట్టి వేసి చదును చేశారు. దీనివల్ల ఇసుక తిన్నెలతో ఉండే సహజ వాతావరణానికి ముప్పు ఏర్పడుతోంది. అలాదే సాగర జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పర్యావరణవేత్తలు, మత్స్యసంపదపైనా ప్రభావం ఉంటుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.