అప్పు తీర్చలేదని మహిళను వేడి నూనెలో..! ఫైనాన్షియర్ ఘాతుకం
పాడేరు : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పాడేరులో ఫైనాన్షియర్ రెచ్చిపోయాడు. ఇచ్చిన అప్పు వసూలు చేసుకునే క్రమంలో రాక్షసంగా ప్రవర్తించాడు. డబ్బుల కోసం వేధించడమే గాకుండా మహిళ అని చూడకుండా దారుణంగా వ్యవహరించాడు. శనివారం రాత్రి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
పాడేరు పాత బస్టాండ్ సమీపంలో నివసించే రత్నం అనే మహిళ.. ఏడేళ్ల కిందట భర్తను కోల్పోయింది. ఇద్దరు పిల్లలతో పాటు కుటుంబ పోషణ భారం కావడంతో పాత బస్టాండ్ దగ్గర బజ్జీల కొట్టు నడిపిస్తున్నారు. అయితే డబ్బులు అవసరం కావడంతో కొద్ది నెలల కిందట పెంటారావు అనే డైలీ ఫైనాన్షియర్ నుంచి 20 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు.
రోజుకింత కడుతూ ఇప్పటివరకు దాదాపు 10 వేల 600 రూపాయలు ఆయనకు తిరిగి చెల్లించింది. ఈమధ్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో కొట్టు తీయడం లేదు. అయితే ఫైనాన్షియర్ పెంటారావు డబ్బు చెల్లించాలంటూ తీవ్రంగా వత్తిడి తెచ్చాడు. ఆ క్రమంలో శుక్రవారం రోజున ఆమెతో వాగ్వాదానికి దిగాడు. శనివారం రాత్రి 8-9 గంటల మధ్యలో బజ్జీల కొట్టు దగ్గరకొచ్చిన పెంటారావు డబ్బులు చెల్లించాలంటూ వేధించాడు.
ప్రస్తుతం డబ్బులు లేవు, నెమ్మదిగా ఇస్తాలే అని రత్నం చెప్పడంతో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. బజ్జీల కోసం వేడిచేసిన నూనెలో ఆమె తలను ముంచాడు. రత్నం తేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాదాపు 50 శాతం చర్మం కాలిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఫైనాన్షియర్ పెంటారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.