విశాఖలో మరో ప్రమాదం... ఫార్మా కంపెనీలో పేలుడు... ఎగసిపడ్డ మంటలు..
విశాఖపట్నంలోని పరిశ్రమల్లో వరుస ప్రమాద ఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అచ్యుతాపురం సెజ్లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడినట్లు సమాచారం.
Recommended Video
సమీపంలోనే ఫైరింజన్ అందుబాటులో ఉండటంతో సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. మంటలు త్వరగానే అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఫైరింజన్తో త్వరగా మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
పేలుడు శబ్దాలు విని కార్మికులు పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. విశాఖ పరిశ్రమల్లో గత రెండు నెలలుగా వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన నాటి నుంచి వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత సాయినార్ లైఫ్ సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లోనూ గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి హెచ్డీఎస్ గ్యాస్ లీకవడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకు రాంకీ ఫార్మా సిటీలోనూ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ తర్వాత విశాఖ సాల్వెంట్ కంపెనీలోనూ పేలుళ్లు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు. ఇక నిన్నటికి నిన్న హిందూస్తాన్ షిప్యార్డులో భారీ క్రేన్ కూలి 14 మంది చనిపోయారు. తాజాగా విజయశ్రీ ఫార్మాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.