విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం... కంటైనర్ యార్డులో ఎగసిపడ్డ మంటలు...
విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సమీపంలోని గేట్ వే యార్డులో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంటైనర్లను తరలించే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కంటైనర్లలో రసాయన పదార్థాలు ఉండటంతో.. ఆ మంటలు అంటుకుని దట్టమైన పొగలు వ్యాప్తి చెందినట్లు సమాచారం. కెమికల్ గ్యాస్ వాసన రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక కంటైనర్ పూర్తిగా దగ్ధం కాగా,మరో రెండు కంటైనర్లు స్వల్పంగా దగ్ధమైనట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందిన వెంటనే మర్రిపాలెం నుంచి హుటాహుటిన ఫైరింజన్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఎట్టకేలకు మంటలు అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 12 మంది మృతి చెందిన ఘటన మరవకముందే... సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హైడ్రోజన్ సల్ఫైడ్ లీకై ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాంకీ కంపెనీలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకరు సజీవ దహనమయ్యారు. తాజాగా కంటైనర్ యార్డులో ప్రమాదం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా పాలనా రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాల్లో ఉండగా... ఇలా విశాఖలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం గమనార్హం.