నూతన్ ఇంట్లో శిరోముండనం -నిందితుల పైశాచికానందం -కీలకంగా ఫోరెన్సిక్ నివేదిక..
విశాఖ జిల్లా పెందుర్తిలోని టాలీవుడ్ నిర్మాత, నటుడు నూతన్ నాయుడు ఇంట్లో చోటు చేసుకున్న దళిత యువకుడి శిరోముండనం ఘటనపై పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు.. నిందితులు సెల్ఫోన్ల ద్వారా కూడా ఈ దృశ్యాలను చిత్రీకరించి తమ స్నేహితులకు పంపుకున్నట్లు గుర్తించారు. దీంతో సెల్ పోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలన కోసం పంపారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే వీరి పైశాచికాన్ని నిరూపించేందుకు పూర్తి స్ధాయిలో అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.
Recommended Video
శిరోముండనంలో పైశాచికత్వం...
విశాఖలో నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన శిరో ముండనం ఘటన దర్యాప్తులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్పీడు పెంచిన పోలీసులు.. మరిన్ని ఆధారాలు సంపాదించారు. శిరోముండనం జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న పలువురు తమ సెల్ ఫోన్లలో ఈ ఘటనను చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఈ దృశ్యాలను తమ స్నేహితులు, సన్నిహితులకు పంపుకున్నట్లు కూడా నిర్ధారణ అయింది. దీంతో శిరోముండనం ఘటన ఆషామాషీగా జరిగింది కాదనే విషయం తెలుస్తోంది. శిరోముండనం ఘటనలో పాల్గొన్న వారిలో నూతన్ భార్య మధుప్రియతో పాటు మొత్తం ఏడుగురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు... వారి నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
విజువల్స్ అక్కడే డిలీట్...
నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన శిరోముండనంలో పాల్గొన్న వారిలో ఓ బ్యూటీషియన్ తో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు.. వీరు తమ స్నేహితులకు, తెలిసిన వారికి ఈ విజువల్స్ పంపుకున్నారు. అయితే వీరిలో కొందరు పంపిన తర్వాత ఎందుకైనా మంచిదని తమ ఫోన్ల నుంచి వాటిని డిలీట్ చేసేశారు. ఇలా విజువల్స్ పంపిన తర్వాత డిలీట్ చేసిన వారిలో బ్యూటీషియన్ ఇందిరా రాణి కూడా ఉన్నారు. అసలు ఈ విజువల్స్ ఎవరెవరికి పంపారు. ఆ తర్వాత ఎందుకు డిలీట్ చేశారన్న దానిపై ఇప్పుడు పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇందుకోసం వీరు వాడిన సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఫోరెన్సిక్ అధ్యయనంలో దీనిపై మరింత సమాచారం లభించే అవకాశముంది.
కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదిక...
వాస్తవానికి దళిత యువకుడికి శిరోముండనం ఘటన తీవ్రమైనది. దాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరణ చేసి ప్రచారం చేయడం మరింత తీవ్రమైన నేరం. దీంతో తాజాగా అందుతున్న సమాచారం మేరకు సెల్ఫోన్ల ద్వారా ఈ దృశ్యాలు ఎవరెవరికి చేరాయో తేలితే అక్కడి నుంచి మరెవరికైనా వెళ్లాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అందుకే ఇప్పుడు సెల్ఫోన్లలో సమాచారాన్ని వెలికితీసే అవకాశం ఉన్న ఫోరెన్సిక్ నివేదిక ఈ కేసులో కీలకంగా మారిపోయింది. ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైతే ఈ కేసులో నిందితుల సంఖ్య పెరిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. అప్పుడు నూతన్ కుటుంబానికి ఉన్న పరిచయాలు, సన్నిహితుల వివరాలు కూడా బయటికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.