వైసీపీలో గంటా రాక - విశాఖ రాజకీయాల్లో పెను మార్పులు ? ఎవరెవరికి చెక్ పడుతుందంటే...
విశాఖపట్నం : కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నా టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గంటా రాకతో విశాఖ వైసీపీ రాజకీయాల్లో వచ్చే మార్పులేమిటి ? నగరంలో వైసీపీకి ఉన్న నాయకత్వ లేమిని ఆయన తీర్చబోతున్నారా ? గంటా ఎంట్రీతో వైసీపీలో ఎవరెవరికి చెక్ పడుతుందన్న అంశాలపై ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయన ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వారు తాజాగా ఈ వార్తలపై స్పందించకపోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.
వైసీపీలో ఖాయమైన గంటా ఎంట్రీ...
ఏపీలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన గంటా శ్రీనివాసరావు గతంలో కాంగ్రెస్ పార్టీతో మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంత్రిగా వ్యవహరించారు. తాజాగా గతేడాది మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కు సన్నిహితులుగా ఉన్న కొందరు గంటాతో మాట్లాడి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 15న వైసీపీలోకి గంటా శ్రీనివాస్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైసీపీలోకి రాకుండా ఇప్పటికే మద్దతు ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యేల తరహాలో కేవలం మద్దతుతోనే సరిపెట్టబోతున్నారనే ప్రచారం కూడా ఉంది. మొత్తానికి టీడీపీకి ఝలక్ ఇవ్వడం మాత్రం ఖాయమని తెలుస్తోంది.
విశాఖ రాజకీయాల్లో మార్పులు..
గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే విశాఖపై దృష్టిపెట్టిన వైసీపీకి పరిస్ధితులు మాత్రం కలిసి రాలేదు.. విశాఖ ఎంపీ సీటుతో పాటు రూరల్ లోని ఎమ్మెల్యే సీట్లు గెలిచినా నగరానికి వచ్చే సరికి చుక్కెదురైంది. ఇక్కడ టీడీపీ నాలుగు సిటీ సీట్లను కైవసం చేసుకుంది. దీంతో అధికార పార్టీగా త్వరలో రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ నగరంపై పట్టు పెంచుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. ఇందుకోసం ఇప్పటికే అక్కడ ఉన్న నేతలను పరిశీలించినా... నగరాన్ని ఏలే స్ధాయిలో ఉన్న వారు ఎవరూ కనిపించడం లేదు. ఎంపీ విజయ సాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నప్పటికీ వారు నగరంపై పూర్తిగా పట్టు పెంచుకోలేకపోతున్నారు. దీంతో ఆ లోటును భర్తీ చేసేందుకు గంటాను వైసీపీలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
మేయర్ పీఠంపై కన్ను..
విశాఖ నగరానికి కీలకమైన కార్పోరేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఎన్నికలను త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో మేయర్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ భావిస్తోంది. అది జరగాలంటే నగరాన్ని లీడ్ చేసే నాయకులు తప్పనిసరి. దీంతో గంటాకు ఈ బాధ్యత అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంపై పూర్తి పట్టు ఉండటం, అంగబలం, అర్ధబలం ఉన్న నేత కావడం గంటాకు కలిసి వస్తోంది. అదే సమయంలో మేయర్ పదవిని గెలిపించి జగన్ కు కానుకగా ఇస్తానని గంటా హామీ ఇచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
గంటా రాకతో ఎవరెవరికి చెక్ ?
విశాఖ వైసీపీలో గంటా శ్రీనివాస్ ఎంట్రీతో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకూ విశాఖలో పార్టీ రాజకీయాలు చూస్తున్న సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు వినిపించేది. కానీ తాజాగా గంటా ఎంట్రీకి వీరిద్దరూ అభ్యంతరాలు చెబుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన పార్టీలోకి వస్తే ముందుగా వీరికి ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది. వీరితో పాటు విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఎప్పటినుంచో ఆశిస్తున్న సీనియనేత, మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా గంటా చెక్ పెట్టవచ్చనే ప్రచారం స్ధానికంగా జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియకపోయినా గంటా వైసీపీలో ఎంట్రీ ఇస్తే మాత్రం విశాఖ రాజకీయాల్లో కీలకంగా ఉన్న చాలా మందికి కష్టాలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.