ఆగస్టు 9న వైసీపీలో గంటా చేరిక- టీడీపీ మాజీలు కూడా.. తెరవెనుక చక్రం తిప్పిన మెగాస్టార్ ?
ఏపీలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖలో రాజకీయంగా పట్టు సాధించేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్న వైసీపీ.. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధపడుతోంది. ఇదే క్రమంలో విశాఖ రాజకీయాల్లో కీలకమైన నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఈ నెల 9న వైసీపీలోకి చేర్చుకునేందుకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీలు కూడా వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
వైసీపీలో గంటా రాక - విశాఖ రాజకీయాల్లో పెను మార్పులు ? ఎవరెవరికి చెక్ పడుతుందంటే...
గంటా చేరికకు ముహుర్తం ఇదే....
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారు అయింది. తొలుత ఆగస్టు 15న ఆయన వైసీపీలో చేరతారని భావించినా తాజాగా ఇది ఆగస్టు 9కు మారినట్లు తెలుస్తోంది. అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటాతో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు వైసీపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస్ వైసీపీకి మద్దతు ప్రకటించడంతో సరిపెడతారని, ఆయన వర్గానికి చెందిన మిగిలిన టీడీపీ మాజీలు మాత్రం వైసీపీ కండువాలు కప్పుకుంటారని తెలుస్తోంది.
గంటా చేరిక వెనుక మెగాస్టార్ ?
గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాస్ కు అధినేత చిరంజీవితో మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వెనుక చిరంజీవి వెంట ఉండి నడిపించింది కూడా గంటా శ్రీనివాసే అని చెబుతుంటారు. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాలను వదిలిపెట్టేసినా గంటా మాత్రం టీడీపీలోకి వెళ్లిపోయారు. అయినా టీడీపీతో విభేదించే చిరంజీవి ఏర్పాటు చేసే సినీ కార్యక్రమాలకు కూడా గంటా వెళ్లేవారు. చిరంజీవితో గంటా సంబంధాలు తెలిసిన చంద్రబాబు కూడా ఈ విషయంలో అడ్డు చెప్పేవారు కాదు. అలా తనతో సత్సంబంధాలు కొనసాగించే గంటాను వైసీపీలోకి పంపే విషయంలో చిరంజీవి కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో జగన్ తో భేటీ సందర్భంగా గంటా ఎంట్రీకి జగన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత పార్టీలో మరో కీలక నేత సజ్జల కూడా గంటాకు మద్దతునివ్వడంతో ఆయన ఎంట్రీ కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది.
Recommended Video
గంటాతో పాటు ఆయన వర్గం కూడా..
విశాఖ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వారిలో గంటా శ్రీనివాస్ తో పాటు ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్యతో పాటు పలువురు నేతలు ఉన్నారు. వీరంతా ప్రజారాజ్యం పార్టీతో పాటు అనంతరం కూడా గంటాతో కలిసి అడుగులు వేసిన వారే. ఇదే గ్రూపులో ఉన్న అవంతి శ్రీనివాస్ ఆ తర్వాత గంటాకు టాటా చెప్పిసినా మిగతా వారు మాత్రం ఇంకా ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. దీంతో వీరిని కూడా వైసీపీలోకి తీసుకొచ్చేందుకు గంటా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా అనుకూలిస్తే వీరంతా వైసీపీలోకి వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సిద్ధాంతాల ప్రకారం ప్రస్తుతం మాజీలుగా ఉన్న వీరంతా పదవులకు రాజీనామాలు కూడా చేయాల్సిన అవసరం లేకపోవడం మరో కలిసొచ్చే అంశం.