కొడాలి నానీకి అనిత హితవు .. మీరేం చెప్పినా నమ్మటానికి ప్రజలు మూర్ఖులు కాదు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని భాషను మార్చుకోవాలని అనిత హితవుపలికారు. కొడాలి నాని మంత్రి స్థానంలో ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన హుందాగా మాట్లాడాలని ఒక సోదరిగా సలహా ఇస్తున్నాను అంటూ అనిత కొడాలి నానికి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును విమర్శించడం తగదని అనిత పేర్కొన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి మహిళలను దారుణంగా మోసం చేశారని టిడిపి నేత వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. దశలవారీగా మద్య నిషేధం చేస్తామంటూ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మద్యపాన నిషేధంలో భాగంగా ధరలు పెంచామని చెప్పారని, ఇప్పుడు ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆమె మండిపడ్డారు.
మీరేం చెప్పినా నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కాదని అనిత అభిప్రాయపడ్డారు. వైసిపి ప్రభుత్వం మద్యం పాలసీ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన అనిత, మళ్లీ ప్రజలను తాగుబోతులుగా తయారు చేయడం కోసమే మద్యం ధరలు తగ్గించాలంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఏపీలో గ్రామ వాలంటీర్లు కుక్కర్ లలో కూడా నాటుసారా తయారు చేస్తున్నారని అనిత ఆరోపణలు చేశారు. ఏపీలో అక్రమ మద్యం దందా చేస్తున్న వారు వైసిపి కార్యకర్తలేనంటూ అనిత విమర్శలు గుప్పించారు.