వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే: నెక్స్ట్ ఎవరు? ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే టార్గెట్?
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు. పంచకర్ల రమేష్బాబుతో పాటు విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, అనుచరులు వైఎస్ఆర్సీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ వారికి కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆ సమయంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరడానికి చాలాకాలం నుంచే పంచకర్ల ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం ఆయన ఇదివరకే తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఊహించినట్టే.. ఆయన అడుగులు వైఎస్ఆర్సీపీ వైపే పడ్డాయి. పంచకర్ల రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పెందుర్తి నియోజకవర్గం నుంచి, 2014లో తెలుగుదేశం నుంచి విజయం సాధించారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా యలమంచిలి నుంచి పోటీ చేసిన పంచకర్ల ఓటమి చవి చూశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకట రమణమూర్తి రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా లేరు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయిస్తామని ప్రకటన చేయడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Recommended Video
కొద్దిరోజుల కిందటే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా వైఎస్ఆర్సీపీలో చేరారు. పంచకర్ల రమేష్బాబు చేరికతో విశాఖపట్నంలో వైసీపీ మరింత బలోపేతమౌతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన చేరిక మరికొంతమంది టీడీపీ నేతలు వైసీపీలో చేరడానికి కారణమౌతుందనీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే.. వైసీపీలో చేరడానికి బాటలు వేసినట్టవుతుందనీ చెబుతున్నారు. కొద్దిరోజులుగా ఆ ఎమ్మెల్యే టీడీపీలో కొనసాగడంపై డోలాయమానంలో ఉన్నారని, రాజకీయ భవిష్యత్తుకు భరోసా అంటూ లభించితే.. వెంటనే ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపొచ్చనీ అంటున్నారు.