విషాదం: పెద్దేరువాగు ఊబిలో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృతి
విశాఖపట్నం: జిల్లాలోని వి. మాడుగుల మండలం జూలంపిల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం బట్టలు ఉతికేందుకు వెళ్లి.. పెద్దేరు వాగులో గల్లంతయ్యారు.
బట్టలు ఉతికేందుకు కుటుంబసభ్యులు వెళ్లుండగా.. వారితో కలిసి ఈ చిన్నారులంతా వెళ్లారు. ఈ క్రమంలో ఈ చిన్నారులంతా ప్రమాదవశాత్తు పెద్దరేవు ఊబిలో చిక్కుకుని గల్లంతయ్యారు. భయాందోళనలకు గురైన కుటుంబసభ్యులు వెంటనే గ్రామస్తులకు తెలయిజేయడంతో వారంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాలింపు చర్యలు చేపట్టి వాగులోంచి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. వీరంతా గిరిజన కుటుంబాలకు చెందినవారు. ఒకేసారి నలుగురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతి చెందిన చిన్నారులను నీలాపు మహేందర్(7), వంత్తాల వెంకటఝాన్సీ(10), వంత్తాల షర్మిల(7), వంత్తాల జాహ్నవి(11) ఉన్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు బాలికలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
నవవరుడు ఆత్మహత్య
పెళ్లయిన నెల రోజులకే ఓ నవవరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన మొల్లేటి జగన్ ప్రసాద్(26) కొన్నేళ్లుగా అనకాపల్లిలో ఉంటున్నాడు. వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రసాద్కు జూన్ 4న మేనత్త కూతురుతో వివాహం జరిగింది.
ఆ తర్వాత ప్రసాద్ దంపతులు బీఆర్టీ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్యను శనివారం పుట్టింటికి పంపిన ప్రసాద్.. ఆదివారం ఇంటి నుంచి బయటికి రాలేదు. బీఆర్టీ కాలనీలోనే ఉంటున్న మేనమామ కూతురు అనుమానం వచ్చి చూడగా.. ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగన్ ప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పెళ్లైన నెల రోజులకు ప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.