విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఎయిరిండియా విమానాలకు బ్రేక్?
విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానాలకు బ్రేక్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎయిరిండియా విమానాలకు ఇంధనం (జెట్ ఫ్యూయల్) సరఫరాను చమురు ఉత్పాదక సంస్థలు నిలిపి వేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నేతృత్వం వహిస్తోన్న చమురు ఉత్పాదక సంస్థల అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. ఎయిరిండియా సంస్థ యాజమాన్యం నుంచి అందాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్లే జెట్ ఫ్యూయల్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా అధికార ప్రతినిధి ధనంజయ కుమార్ తెలిపారు.
విశాఖపట్నంతో పాటు రాంచీ, మొహాలీ, పాట్నా, పుణె, కొచ్చి విమానాశ్రయాలు కూడా ఎయిరిండియా విమానాలకు మాత్రమే చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. జెట్ ఫ్యూయల్ సరఫరాను పునరుద్ధరించేలా తాము సంబంధిత అసోసియేషన్ తో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు ధనంజయ కుమార్ పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాము ఇప్పటికే 60 కోట్ల రూపాయలను చమురు ఉత్పాదక సంస్థ అసోసియేషన్ కు చెల్లించినట్లు చెప్పారు. తమ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని, జెట్ ఫ్యూయల్ ను కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తాన్ని తాము త్వరలోనే చెల్లిస్తామని అన్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈక్వటీ సకాలంలో అందకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా ప్రభుత్వం నుంచి ఈక్విటీ అందాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థికపరమైన అండదండలు లేకపోతే.. నష్టాల నుంచి తేరుకోవడం కష్టసాధ్యమని ధనంజయ కుమార్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియా నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఎయిరిండియా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రోజువారీ ఆదాయంతోనే పరిస్థితులను నెట్టుకొస్తోంది.