గాజువాక ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య ... క్షుద్రపూజల ట్విస్ట్ .. నిందితుడి 'లా' తెలివి !!
ప్రేమోన్మాది దాడిలో బలైపోయిన గాజువాక మైనర్ బాలిక వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. ఘటనా స్థలంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి .విశాఖ జిల్లా గాజువాక లో ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో అఖిల్ పక్కా ప్లాన్ ప్రకారం వరలక్ష్మి మర్డర్ చేసినట్లు భావిస్తున్నారు. వరలక్ష్మిని చంపి తనపై కేసులు రాకుండా ఉండేలా సీన్ క్రియేట్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుడు లా చదివిన వ్యక్తి కావడంతో తన తెలివిని ఉపయోగించి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడని భావిస్తున్నారు .
Recommended Video
చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ఎలా ..మహిళల రక్షణకు ఆ పని చెయ్యండి : పవన్ కళ్యాణ్ సలహా
హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన మహిళా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
గాజువాకలో హత్య జరిగిన ప్రదేశాన్ని మహిళా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పరిశీలించింది. మహిళా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పలు అనుమానాలు సైతం వ్యక్తం చేసింది. పోలీసులు సీన్ అఫ్ ఇంట్లో వరలక్ష్మి కు సంబంధించిన అన్ని వస్తువులు భద్ర పరిచినట్లు తమకు అనిపించుకో లేదని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఘటనా స్థలంలో క్షుధ్రపూజలపై విచారణకు డిమాండ్
మైనర్ బాలిక పై దాడి జరిగిన ఘటనా స్థలం వద్ద క్షుద్ర పూజలు జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మహిళా సంఘాల ప్రతినిధులు .మహిళా స౦ఘాల అనుమానానికి తగ్గట్టు ఘటనా స్థలంలో ఉన్న నిమ్మకాయలు, కోడిగుడ్ధు, నల్లటి వస్త్రం,పసుపు , కు౦కుమలు ఉన్నాయని తెలుస్తుంది . బాలికపై దాడికి పాల్పడిన శనివారం రాత్రి పౌర్ణమి కావట౦, బ్లూ మూన్ ఉ౦డట౦, బాధితురాలు 17 ఏళ్ళ వయసు కలిగిన బాలిక కావటంతో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
హత్యకేసులో పలు అనుమానాలు వ్యక్తం చేసిన మహిళా సంఘాలు
బాలికపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పీవోడబ్ల్యూ , ఏపీ మహిళా స౦ఘాల జాయింట్ యాక్షన్ కమిటీ దాడిపై పోలీసులనే తప్పుదారి పట్టి౦చేలా అఖిల్ కొత్త కథనాన్ని అల్లడానికి ఇదంతా చేసాడేమో అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ని౦దితుడి త౦డ్రే దాడి ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .కేవలం ప్రేమ దాడిగానే కాకుండా క్షుద్రపూజల కోణంలోను లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా స౦ఘాల ప్రతినిధులు. ఇక పోలీసులు సైతం క్షుద్ర పూజల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు.
నిందితుడి లా తెలివి ... కేసు పక్కదోవ పట్టేలా మాస్టర్ ప్లాన్
హత్య జరిగిన ప్రాంతంలో నిందితుడు అఖిల్ క్షుద్రపూజలు జరిగినట్టు సీన్ క్రియేట్ చేసాడని, ఆధారాలు లేకుండా చేయడానికి తనతో తెచ్చుకున్న కారాన్ని ఆ ప్రదేశంలో చల్లాడని అనుమానిస్తున్నారు.హత్య పై అనుమానాలు రేకెత్తించడం కోసం రామ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నట్లుగా పోలీసులకు కథ చెప్పాడని, రామ్, వరలక్ష్మి కలిసి ఉన్న సమయంలో తాను దాడి చేశారని అంతా భావించేలాగా మాస్టర్ ప్లాన్ వేశాడని పోలీసుల విచారణలో తేలినట్లుగా సమాచారం.