ఏపీలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు; విశాఖ ఏజెన్సీలో సినీ ఫక్కీలో తెలంగాణా పోలీసులపై గొడ్డళ్ళు, రాళ్ళతో దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విశాఖ ఏజెన్సీలో లంబసింగి సమీపంలో గంజాయి స్మగ్లర్లు సినీఫక్కీలో తెలంగాణా పోలీసులపై దాడికి ప్రయత్నించారు. గొడ్డళ్ళు, రాళ్లతో దాడికి తెగబడిన గంజాయి స్మగ్లర్లు పోలీసులపై విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ లంబసింగిలో గంజాయి స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది.
అక్రమ రవాణా అడ్డుకుంటే దాడులకు తెగబడుతున్న గంజాయి స్మగ్లర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మన్యంలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు 15 వేల ఎకరాలలో గంజాయి సాగు జరుగుతుందని, గంజాయి సామ్రాజ్యం ఏపీలో విస్తరిస్తోంది అని, గంజాయి స్మగ్లింగ్ వెనుక మహారాష్ట్రకు చెందిన కాలే గ్యాంగ్, పవార్ గ్యాంగ్ లు ఉన్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విశాఖ ఏజెన్సీ నుండి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ , సిక్కిం, నాగాలాండ్, తమిళనాడు, కేరళ, రాష్ట్రాలకు విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. గంజాయి స్మగ్లర్ల ముఠా అక్రమ రవాణాను అడ్డుకుంటే దాడులకు సైతం తెగబడుతోంది.
మూడు రోజులుగా తెలంగాణా పోలీసులు విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపు
ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యవహారంలో దృష్టిసారించిన నల్లగొండ పోలీసులు, గంజాయి కేసులో నిందితుల కోసం ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని కొయ్యూరు మండలం తురబాలగడ్డ వద్ద గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందం మూడు రోజులుగా విశాఖ ఏజెన్సీలో గంజాయి ముఠా కోసం జల్లెడ పడుతున్న నేపథ్యంలో గంజాయి స్మగ్లర్ల ముఠా సినీ ఫక్కీలో తెలంగాణ పోలీసు బృందంపై దాడికి ప్రయత్నించింది. గంజాయి స్మగ్లర్ల గ్యాంగ్ ఉన్నట్టు పసిగట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చెయ్యగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
పోలీసులకు అడ్డంగా టిప్పర్ పెట్టి కత్తులు, గొడ్డళ్ళు, రాళ్ళతో దాడి చేసిన గంజాయి స్మగ్లర్లు
దాదాపు 15 నుండి 20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులను అడ్డగించిన గంజాయి స్మగ్లర్ల గ్యాంగ్ రోడ్డుకు అడ్డంగా టిప్పర్ వాహనాన్ని నిలిపి కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోవడంతో పోలీసులు గాలిలోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో కామరాజు, రాంబాబుకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అదనుగా గంజాయి స్మగ్లర్లు తప్పించుకుని పారిపోయారు. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.
Recommended Video
విశాఖ ఏజెన్సీలో పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి ఘటనపై స్పందించిన డీఐజీ
ఈ ఘటనపై స్పందించిన నల్గొండ డిఐజి రంగనాథ్ పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. ఇటీవల గాలి పాడు కు చెందిన ముగ్గురు వ్యక్తులు విశాఖ లంబసింగి ఏరియా నుండి గంజాయి అక్రమ రవాణా చేస్తూ నల్గొండ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఈ నెల 15వ తేదీన కిల్లో బాలకృష్ణ, నారా లోవా, కిల్లో భీమరాజు అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణ పోలీసులు విశాఖ లంబసింగి ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్లు కూడా ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడి దాడికి ప్రయత్నించారని, ఈ దాడిలో పోలీసులకు ఎవరికీ ఎలాంటి ప్రాణహానీ లేదని డీఐజీ రంగనాథ్ వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్ల కోసం సోదాలు చేస్తున్న నల్గొండ పోలీసులకు స్థానిక పోలీసులు, ఎస్పీ సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.