విశాఖ ఏజెన్సీ టు ఒడిశా: పైన అరటి గెలలు..కింద గంజాయి పాకెట్లు: అక్రమ రవాణా..పట్టివేత..!
విశాఖపట్నం: విశాఖపట్నంలో మరోసారి భారీ ఎత్తున గంజాయి లభించింది. రెండు మినీ లారీల్లో అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాాల్లో సేకరించిన గంజాయిని ఒడిశాకు తరలిస్తున్నట్లు నిర్ధారించారు. మొత్తం 1638 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ 2.45 కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు.
ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. రెండు మినీ లారీలను సీజ్ చేశారు. ఈ రెండు కూడా ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయ్యాయని డీఆర్ఐ అధికారులు తెలిపారు. అరటి గెలల మాటున గంజాయి పాకెట్లను రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులు వల పన్నారు. ఓడి బీడీ 4155, ఓడీ యూ 7223 నంబర్లు ఉన్న మినీ లారీల్లో వాటిని తరలిస్తున్నట్లు తేలడంతో నేవీ అర్మమెంట్ డిపో (ఎన్ఏడీ) జంక్షన్ వద్ద మాటు వేశారు.
విశాఖపట్నాం మీదుగా ఒడిశా వైపు వెళ్లడానికి ఇదొక్కటే మార్గం కావడంతో ఈ రెండు మినీ లారీలు ఎన్ఏడీ జంక్షన్కు చేరుకున్న వెంటనే అధికారులు వాటిని నిలిపివేశారు. తనిఖీ చేయగా.. అరటి గెలల కింద గంజాయి పాకెట్లు కనిపించాయి. ఒక్కో మినీ లారీలో 400 చొప్పున పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఒడిశా రాజధాని భువనేశ్వర్కు తరలిస్తున్నట్లు వారు అంగీకరించినట్లు తెలిపారు.
నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని ఏజెన్సీ గ్రామాల నుంచి వాటిని సేకరించినట్లు నిందితులు వెల్లడించారని అన్నారు. ఈ మధ్యకాలంలో తరచూ గంజాయి అక్రమ రవాణా నమోదవుతోందని, ఇంత భారీ మొత్తంలో లభించడం ఇదే తొలిసారి అని డీఆర్ఐ అధికారులు తెలిపారు. విశాఖపట్నం, ఛత్తీస్గఢ్లల్లో విస్తరించిన దండకారణ్యం అడవుల్లో గంజాయిని విస్తారంగా పండిస్తున్నారని, విశాఖపట్నం మీదుగా ఒడిశాకు తరలిస్తున్నారని పేర్కొన్నారు.