చంద్రబాబు ఆదేశాలు బేఖాతర్: పవన్ మార్చ్ కు గంటా గైర్హాజరు: టీడీపీలో కొనసాగుతారా..!
ఊహించిందే జరిగింది. టీడీపీ అధినేత ఆదేశాలను సైతం మాజీ మంత్రి గంటా బేఖాతర్ చేసారు. ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ కు నిర్ణయించారు. ఈ నిరసనలో కలిసి రావాలని అన్ని పార్టీలను ఆహ్వానించారు. అయితే, తొలి నుండి పవన్ తో ఉన్న వామపక్షాలతో సహా కాంగ్రెస్..బీజేపీ సైతం తాము పాల్గొనటం లేదని తేల్చి చెప్పాయి.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఏ పార్టీ అయినా ప్రజా సమస్యల పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మద్దతిస్తామని ప్రకటించారు. పవన్ నిర్వహించే మార్చ్ లో పాల్గొనేందుకు ముగ్గురు మాజీ మంత్రులను చంద్రబాబు ఎంపిక చేసారు. అందులో గంటా శ్రీనివాస రావు ఒకరు. అయితే, ఇప్పుడు అదే గంటా అధినేత ఆదేశాలకు భిన్నంగా పవన్ మార్చ్ కు గైర్హాజరయ్యారు. మిగిలిన ఇద్దరు నేతలు అయ్యన్న పాత్రుడు..అచ్చెన్నాయుడు మాత్రం హాజరయ్యారు.
చాలా కాలంగా పవన్ వర్సెస్ గంటా
పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కు టీడీపీ నుండి చంద్రబాబు ముగ్గురు మాజీ మంత్రుల పేర్లు ఖరారు చేసారు. అందులో గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే, ఇప్పుడు అందరూ గంటా మీదే ఫోకస్ చేసారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసి గెలిచిన గంటా ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం తో మంత్రి పదవి పొందారు. ఇక, 2014లో టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ప్రజారాజ్యం సమయం నుండి నేటి వరకు చిరంజీవితో మాత్రం గంటా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కానీ, పవన్ తో మాత్రం అంత సఖ్యత లేదనే విషయం తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో గంటాకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక దశలో గంటాను ఓడించాలని పిలుపునిచ్చారు.
గంటా పైన పవన్ అదే స్థాయిలో..
గంటా జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నించారని..పవన్ అంగీకరించలేదని అప్పట్లో ప్రచారం సాగింది. ఇక, గంటా సైతం పవన్ వ్యాఖ్యల మీద గట్టిగానే స్పందించారు. ధవళేశ్వరం బ్యారేజీ పైన భారీ కవాతు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన నాడు మంత్రిగా ఉన్న గంటా విమర్శలు చేసారు. ఆ కవాతు ద్వారా ఆయన ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. ఆ గ్యాప్ కారణంగానే ఇప్పుడు గంటా ఈ పవన్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది.పవన్ కళ్యాణ్ తో దాదాపు ఢీ అంటే ఢీ అన్న గంటా ఇప్పుడు విశాఖ నగరంలో జనసేన నిర్వహించే నిరసన మార్చ్ లో టీడీపీ ప్రతినిధిగా పాల్గొనటం పైన తొలి నుండి సందేహాలు ఉన్నాయి. ప్రజారాజ్యంలో కలిసి పోటీ చేసి గెలిచి.. ఆ తరువాత 2014లోనూ టీడీపీలో కలిసి పని చేసి గెలిచిన గంటా..అవంతి ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్ధులుగా మారారు.
ఒకరి పైన మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇదే సమయం లో పవన్ తో సైతం గంటా సంబంధాలు దెబ్బ తిన్నాయి. గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన కన్నబాబు..అవంతి శ్రీనివాస్ కు పవన్ ను రాజకీయంగా టార్గెట్ చేసే బాధ్యతలు ముఖ్యమంత్రి అప్పగించారు.
లాంగ్ మార్చ్ కు గంటా గైర్హాజరు..
ఇక తాను ఓడిపోవాలని పిలుపునిచ్చిన పవన్ కు మద్దతుగా గంటా మార్చ్ లో పాల్గొంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు హాజరవ్వాలా లేదా అనే సంశయంలో గంటా తన సన్నిహితులతో సైతం చర్చించినట్లుగా సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా పార్టీ మారుతారంటూ కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కారణాలు ఏవైనా గంటా మాత్రం తన మనసు మార్చుకోలేదు. పవన్ కళ్యాణ్ మార్చ్ కు దూరంగానే ఉన్నారు. దీని ద్వారా..ఇక ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగానే గంటా శ్రీనివాస రావు టీడీపీని వీడుతారా..లేక తన గైర్హాజరకు కారణాలు చెప్పి..వివాదానికి ముగింపు పలికి టీడీపీలోనే కొనసాగుతారా అనేది ఆసక్తి కరంగా మారింది.