విశాఖలో దారుణం... యువతిపై కత్తితో దాడి... మృతి చెందిన బాధితురాలు...
విశాఖపట్నంలో దారుణం జరిగింది. గాజువాక శ్రీనగర్ సుందరయ్యకాలనీలో అఖిల్ అనే యువకుడు ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. స్థానిక సాయిబాబా గుడి వద్ద యువతితో మాట్లాడుతున్న సందర్భంలో అఖిల్ కత్తితో ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు అఖిల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల విజయవాడలో దివ్య తేజస్విని అనే బీటెక్ విద్యార్థినిని ప్రేమోన్మాది నాగేంద్ర బాబు హత్య చేసిన ఘటన మరవకముందే... విశాఖలో మరో ఘటన చోటు చేసుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో దివ్యను వేధించిన నాగేంద్ర బాబు... అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో నేరుగా ఆమె ఇంటికెళ్లి హత్యకు పాల్పడ్డాడు. ఆపై తనపై తాను దాడి చేసుకుని డ్రామాకు తెరలేపాడు. దివ్య,తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని.. ఈ క్రమంలో దివ్య తనకు తానే దాడి చేసుకుందని కట్టు కథ అల్లాడు. కానీ ఫోరెన్సిక్ రిపోర్టులో అసలు నిజాలు వెల్లడవడంతో నాగేంద్ర బాబు దొరికిపోయాడు. అతనే దివ్యను హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. పెద్దలు తమ ప్రేమకు అంగీకరించకపోవడంతోనే ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నాగేంద్ర ఇచ్చిన వాంగ్మూలం తప్పని తేల్చారు.
మరోవైపు,మృతురాలి తల్లిదండ్రులు ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.