నిమ్మగడ్డ మార్క్ ఫైర్: మున్సిపల్ ఎన్నికలకు ముందే: గ్రేటర్ విశాఖ కమిషనర్పై బదిలీ వేటు
విశాఖపట్నం: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. మూడో విడత పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. చివరిది, నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఈ నెల 21వ తేదీన ఆరంభం కానుంది. దీనితో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టవుతుంది. మూడేళ్ల తరువాత గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధుల పాలనకు శ్రీకారం చుట్టినట్టవుతుంది. ఆ వెంటనే మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను చేపట్టడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో దశలవారీగా పోలింగ్ ఆరంభం అవుతుంది.
పోస్టింగ్ ఇవ్వని సర్కార్..
ఈ పరిణామాల మధ్య గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్సొరేషన్ కమిషనర్ గుమ్మళ్ల సృజన బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆమెను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రిలీవ్ కావాలని సూచించారు. 2013 బ్యాచ్ ఐఎఎస్ అధికారిణి సృజన ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. సెలవు ముగిసిన వెంటనే జీఏడీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
జీవీఎంసీ కమిషనర్గా
గుమ్మళ్ల సృజన స్థానంలో మరో ఐఎఎస్ అధికారిణికి ప్రభుత్వం గ్రేటర్ విశాఖ కమిషనర్ బాధ్యతలను అప్పగించింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొనసాగుతోన్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మిని జీవీఎంసీ కమిషనర్గా నియమించింది. 2012 బ్యాచ్ ఐఎఎస్ అధికారిణి నాగలక్ష్మి నియామకానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంగీకారం వ్యక్తం చేశారు. నాగలక్ష్మితో పేరును సూచిస్తూ సాధారణ పరిపాలన శాఖ ప్యానెల్ పంపించిన ప్రతిపాదనలపై ఆయన ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే ఆమెను జీవీఎంసీ కమిషనర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఎక్కడ నిలిచిందో.. అక్కడి నుంచే ఆరంభం..
పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో ఇక మున్సిపాలిటీల్లో ఎన్నికల సమరం ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. దీనికోసం నోటిఫికేషన్ వెలువడింది కూడా. పార్టీల ప్రాతిపదికన జరిగే ఎన్నికలు ఇవి. గత ఏడాది ఎక్కడ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే తిరగి కొనసాగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. నామినేషన్ల ఉపసంహరణలతో ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో వచ్చేెెనెల10వ తేదిన పోలింగ్ ఉంటుంది. 14న కౌంటింగ్. వచ్చేనెల 2వ తేదీ నుంచి నామినేషన్ల ఉపసంహరణ మొదలవుతుంది.
లిస్ట్ ఇదే..
విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియ 2వ తేదీన పునఃప్రారంభమౌతుంది. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది. అదే రోజు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా ఆనెల 15వ తేదిన వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటికే 18,649 మంది నామినేషన్లు వేశారు.