Vizag: విశాఖపై ఫోకస్: కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్: జీవీఎంసీ పర్యవేక్షణలో.. !
విశాఖపట్నం: పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో మిలీనియం టవర్-బీ నిర్మాణానికి భారీగా నిధులను విడుదల చేసిన జగన్ సర్కార్.. తాజాగా నాలుగు కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు అందజేసిన ప్రతిపాదనలపై మున్సిపల్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆమోదం లభించిన రెండు రోజుల వ్యవధిలోనే జీవీఎంసీ అధికారులు టెండర్ల ప్రక్రియను ఆరంభించారు.
Recommended Video
శరవేగంగా విశాఖపట్నం సుందరీకరణ: 20 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు.. !
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని..
సాధారణంగా ఏ రాజధానిలోనైనా వాహనాల రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రోజువారీ అవసరాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచీ రాజధానిని సందర్శించే వారి సంఖ్య ఒక ఎత్తు కాగా.. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చే ప్రజల సంఖ్య ఇంకో ఎత్తు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత.. విజయవాడ, గుంటూరు, మంగళగిరి వంటి ప్రాంతాల్లో వాహనాల తాకిడి గానీ, సందర్శకుల సంఖ్య గానీ ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిన విషయమే. ఈ పరిస్థితి విశాఖపట్నంలో తలెత్తకుండా ఉండటానికి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది.
నాలుగు ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం..
విశాఖపట్నంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన జంక్షన్లలో ఈ నాలుగు కొత్త ఫ్లైఓవర్లను నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలను జీవీఎంసీ అధికారులు ప్రతిపాదించారు. మద్దిలపాలెం, హనుమంతు వాక, కార్ షెడ్, పాత గాజువాకలల్లో ఈ నాలుగు ఫ్లైఓవర్లు నిర్మితం కానున్నాయి. ఇటీవలే జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్ర అవంతి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటైన జీవీఎంసీ సమావేశంలో ఈ ప్రతిపాదనల ప్రస్తావనకు వచ్చాయి. అనంతరం వాటిని మున్సిపల్ మంత్రిత్వ శాఖకు పంపించారు. వాటిపై ఆమోదముద్ర లభించింది.
జీవీఎంసీ పరధిలో సుమారు 21 లక్షల జనాభా..
ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో సుమారు 22 లక్షల మంది వరకు నివసిస్తున్నారు. పరిపాలనా రాజధానిగా మారిన తరువాత ఈ సంఖ్య క్రమంగా 30 లక్షలకు చేరుతుందని జీవీఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే అయిదేళ్లలో 50 నుంచి 75 లక్షల వరకు విశాఖపట్నం జనాభా పెరగడానికీ అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా రెట్టింపు అవుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు భారీగా ఏర్పడటం ఖాయమనీ చెబుతున్నారు. వాటిని పరిష్కరించడానికి అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడం కంటే.. ముందు జాగ్రత్త చర్యలకు దిగడమే మేలనే నిర్ణయానికి వచ్చారు.
డీపీఆర్లకు ఆహ్వానం..
నాలుగు ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్లను రూపొందించడానికి జీవీఎంసీ అధికారులు తాజాగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ) టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 28లోపు బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ టెండర్ల ప్రక్రియను నెలరోజుల వ్యవధిలోనే పూర్తి చేయడంతో ఫ్లైఓవర్లను నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాంతాల్లో భూసార పరీక్షలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. సచివాలయ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో విశాఖ నుంచి కొనసాగించే సమయానికి నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు.