Bulbul Cyclone: ఉత్తరాంధ్రపై బుల్ బుల్ ఎఫెక్ట్..!
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపించే అవకాశం ఉంది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడానికి అవకాశాలు ఉన్నట్లు విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ కు ఈశాన్య దిశగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉందని వెల్లడించారు. క్రమంగా ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ముంబైని వణికిస్తోన్న హికా తుఫాన్: అరేబియా సముద్రం అల్లకల్లోలం: అతి భారీ వర్షాలు!
ప్రస్తుతం ఉన్న కదలికలను బట్టి చూస్తే.. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. క్రమంగా పెను తుఫాన్ గా అవతరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత మరింత ఉగ్రరూపాన్ని సంతరించుకోవచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. శనివారం సాయంత్రం లేదా రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని చెబుతున్నారు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, ఉత్తర ఒడిశా, దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉంటుందని అంటున్నారు.
ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉన్న ప్రదేశంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, క్రమంగా మరింత బలపడటానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గరిష్ఠ వేగం 115 నుంచి 125 కిలోమీటర్ల వేగం పుంజుకునేలా వాతావరణం అనుకూలంగా ఉందని స్పష్టం చేస్తున్నారు. తుఫాన్ తన దిశను మార్చుకునే అవకాశాలు లేకపోలేదని వెల్లడించారు. దిశను మార్చుకుంటే.. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణా, దక్షిణ 24 పరగణాల మధ్య తీరాన్ని తాకుతుందని అన్నారు.