ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సీఎం వైఎస్ జగన్ కు హైపవర్ కమిటీ నివేదిక
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మలివిడత విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. విశాఖలోని ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ సభ్యులుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నివేదికను అందజేశారు.
Recommended Video
కరోనా టెస్టులు మాయా..కుంభకోణమా!! తేల్చాలన్న చంద్రబాబు.. ఘాటుగా సమాధానం ఇచ్చిన సర్కార్
గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపిన హైపవర్ కమిటీ బాధిత గ్రామాల ప్రజల అభిప్రాయాలను, గ్యాస్ లీక్ ఘటనకు గల కారణాలను, అటు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య వివరణను ,సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన అభిప్రాయాలను నమోదు చేసింది. అంతేకాదు ప్రమాదం జరిగిన తీరును, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను హైపవర్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.
గ్యాస్ లీక్ ప్రమాద ఘటనకు సంబంధించి బాధిత ఐదు గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకున్న కమిటీ, వివిధ రాజకీయ పార్టీ నేతల అభిప్రాయాలను, అధికారుల, జర్నలిస్టుల అభిప్రాయాన్ని సైతం తీసుకుని సమగ్ర నివేదికను తయారుచేసింది. ఈ నివేదికను సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్, కమిటీ సభ్యుడు కరికాల వలవన్.. సీఎంకు అందజేశారు. ఇదే సమయంలో హైపవర్ కమిటీ నివేదికకు సంబంధించి వైజాగ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వినయ్ చంద్, అలాగే వైజాగ్ నగర కమిషనర్ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు.
మే 7న ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ ఘటనపై ఆరు ప్రత్యేక కమిటీలతో పాటు హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీల నివేదికల ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు హైపవర్ కమిటీ నివేదిక సీఎం జగన్మోహన్ రెడ్డికి చేరిన నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ పై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.