గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతలపై హైకోర్టు స్టే... నవంబర్ 30 వరకు...
విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ 30 వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. కోర్టు విచారణ సందర్భంగా... ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులివ్వకుండా పోలీస్ బలగాలను మోహరించి కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు సబబు అని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
కాగా,ప్రభుత్వ భూములను ఆక్రమించారన్న ఆరోపణలతో శనివారం(అక్టోబర్ 24) తెల్లవారుజామున 2గంటలకు గీతం యూనివర్సిటీకి చెందిన పలు నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. గీతం వర్సిటీ మెయిన్ గేటుతో పాటు,సెక్యూరిటీ గదులు,మైదానం చుట్టూ ప్రహారీ గోడను తొలగించారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే యూనివర్సిటీ నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సోమవారం వరకు స్టేటస్ కో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నవంబర్ 30 వరకు కూల్చివేతలపై స్టే విధించింది.
మరోవైపు గీతం వర్సిటీలో కూల్చివేతలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తోంది. మొన్నటికి మొన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరిని కూల్చివేసిన ప్రభుత్వం... ఇప్పుడు గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చివేయడం టీడీపీని లక్ష్యంగా చేసుకోవడమేనని ఆరోపిస్తోంది. గవర్నమెంట్ టెర్రరిజం అంటూ ఇప్పటికే విద్యా వైద్య పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్కు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఇక్కడ విధ్వంసాలను చూసి బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా అనుకుంటూ అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే టీడీపీకి సన్నిహితులు,బంధువులు అయినంత మాత్రానా ఆక్రమణలను ఉపేక్షించాలా అని వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది.