వరలక్ష్మి హత్య : బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి... రూ.10లక్షలు చెక్కు అందజేత
విశాఖపట్నంలో ప్రేమోన్మాది అఖిల్ దాడిలో బలైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు చెక్ అందజేశారు. వరలక్ష్మి కుటుంబ సభ్యులను ఓదార్చిన సుచరిత... ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామని.. నిందితుడిని కఠిన శిక్షిస్తామని చెప్పారు.
వరలక్ష్మిపై దాడికి నిందితుడు అఖిల్కు మరికొందరు సహకరించారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తున్న నేపథ్యంలో... ఆ కోణంలో కేసు విచారణ సాగుతున్నట్లు సుచరిత తెలిపారు. ప్రతీ విద్యార్థి దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా విద్యా సంస్థలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు టీనేజీలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని... వారి కదలిలకలను గమనించాలని అన్నారు.
అఖిల్కు రౌడీషీటర్లతో సంబంధాల నేపథ్యంలో తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని సుచరితను వరలక్ష్మి కుటుంబ సభ్యులు కోరారు. దీంతో ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను సుచరిత ఆదేశించారు.
విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ సుందరయ్యకాలనీలో అఖిల్ అనే యువకుడు వరలక్ష్మి అనే యువతిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. స్థానిక సాయిబాబా గుడి వద్ద యువతితో మాట్లాడుతున్న సందర్భంలో అఖిల్ కత్తితో ఆమెపై దాడి చేశాడు.దీంతో తీవ్ర గాయాలపాలైన యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
Recommended Video
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన వరలక్ష్మికి, లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న అఖిల్తో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆమెకు దగ్గరైన అఖిల్.. ప్రేమ పేరుతో వేధించాడు. శనివారం(అక్టోబర్ 31) రాత్రి... తమ కామన్ ఫ్రెండ్ ఒకరి ద్వారా వరలక్ష్మిని సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అఖిల్ను నిలదీయగా.. మాట్లాడాలి రా అంటూ సాయిబాబా టెంపుల్ కొండమీదికి తీసుకెళ్లాడు.మనసులో కీడును శంకించిన వరలక్ష్మి... ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన అఖిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నరికాడు. వరలక్ష్మి సోదరుడు,ఆమె తండ్రి అక్కడికి చేరుకునేసరికి.. ఆమె రక్తపు మడుగులో కనిపించింది.