విశాఖలో జేడీ ప్రభావం ఎంత..!? క్రాస్ ఓటింగ్ ఆయనకు కలిసొచ్చేనా..?
Recommended Video
విశాఖపట్నం/హైదరాబాద్ : ఉత్తరాంద్రలో ఇప్పుడు అందరి ద్రుష్టి విశాఖ పార్లమెంట్ స్థానం పై కేంద్రీక్రుతమైంది. విశాఖ లోక్సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ భారీగా నమోదైనట్టు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఈసారి పాగా వేసేది ఎవరు? ఇక్కడి నుంచి లోక్సభకు వెళ్లే ప్రతినిధి ఎవరు? ఓటింగ్ ముగిసాక నగర ప్రజానికంలో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇదే..!
విశాఖ లోక్ సభలో విజయం ఎవరిది..! గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు..!!
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షించిన నియోజకవర్గాల్లో గాజువాక అసెంబ్లీ స్థానం, విశాఖ పార్లమెంటరీ స్థానాలున్నాయి. గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడం, విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రంగంలో ఉండడమే ఇందుకు కారణం. గాజువాక సంగతి పక్కన పెడితే విశాఖ లోక్సభ స్థానం విషయంలో పార్టీలకతీతంగా ఓ అభ్యర్థి విషయంలో చర్చనడిచింది. ఆయనే లక్ష్మీనారాయణ.
చతుర్ముఖ పోటీ..! ఎడ్జ్ మాత్రం ఆ పార్టీకే అంటున్న విశ్లేషకులు..!!
చతుర్ముఖ పోటీ జరిగిన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి తప్ప టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు ముగ్గురూ రాజకీయాలకు కొత్తవారే. కానీ జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన లక్ష్మీనారాయణ పార్టీ ఇమేజ్ కంటే తనదైన వ్యక్తిగత గుర్తింపుతో నగరవాసుల్ని ఎక్కువగా ఆకట్టుకున్నారన్నది విశ్లేషకు అభిప్రాయం. అంతేకాదు జగన్ కేసులను ధైర్యంగా దర్యాప్తు చేశారన్న ముద్ర ఆయనకు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
హామీలే జేడీని గెలిపిస్థాయంటున్న నేతలు..! ప్రజల్లో ఉన్న సానుకూలత..!!
స్థానికుడు కాదన్న ప్రచారాన్ని ఎదుర్కొన్నా.. తాను విశాఖ వదిలి వెళ్లనని, ఇక్కడే ఇల్లు తీసుకున్నానని తేల్చి చెప్పారు. హామీలను నెరవేర్చకపోతే తనపై కేసులు కూడా వేసుకోవచ్చని వందరూపాయల బాండ్ పేపర్పై హామీలన్నీ రాసి ఆ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉంచారు. యువతలో ఆ పార్టీ పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉన్నప్పటికీ అది ఏ స్థాయి ఓటు బ్యాంక్ అన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
భారీగా క్రాస్ ఓటింగ్..! జేడీకే అనుకూలం అంటున్న నాయకులు..!!
ఈ పరిస్థితుల్లో జేడీ వ్యక్తిగత ఇమేజ్ కొంత అడ్వాంటేజ్ అయ్యిందని, నియోజకవర్గంలో నిన్న జరిగిన పోలింగ్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెబుతున్నారు. మొత్తమ్మీద కొంత భిన్నాభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, ఇది లక్ష్మీనారాయణకు లాభిస్తుందని చెబుతున్న వారి సంఖ్యే అధికంగా ఉండడం గమనార్హం. అదే గనక నిజమైతే మాజీ జేడి రేపు పార్లమెంట్ లో అడుగు పెట్టడం ఖాయంగా తెలుస్తోంది.