ఎరక్కపోయి ఇరుక్కుపోయిన నూతన్ నాయుడు-శిరోముండనంలో లేకున్నా- ఫేక్ కాల్స్ చేసి..
ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఏంటో టాలీవుడ్ నిర్మాత, నటుడు నూతన్ నాయుడిని అడిగితే తెలుస్తుందంటున్నారు విశాఖ పోలీసులు. తన ఇంట్లో జరిగిన దళిత యువకుడి శిరోముండనం ఘటనలో ప్రత్యక్ష ప్రమేయం లేని కారణంగా నూతన్ నాయుడు ఈ కేసులో తప్పించుకున్నట్లే అని భావిస్తున్న తరుణంలో ఆయన చేసిన మరో దందా పోలీసులకు పట్టించింది. దీంతో అసలు కేసు నిందితులకు సాయం చేసేందుకు ప్రయత్నించి ఇలా ఇరుక్కుపోయానేంట్రా బాబూ అంటూ నూతన్ తలపట్టుకుంటున్నాడు. దీంతో నూతన్ నాయుడిని పోలీసులు స్ధానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరేందుకు సిద్ధమవుతున్నారు.
నూతన్ మోసాలు, దందాలు...
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన పవర్ స్టార్కు పోటీగా పరాన్నజీవి చిత్రాన్ని నిర్మించి సంచలనం రేపిన నూతన్ నాయుడు ఈ ప్రయత్నం ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు. గతంలో బిగ్బాస్ హౌస్కు వెళ్లొచ్చినప్పుడు కూడా రాని పేరు ఈ సినిమాతో సంపాందంచిన నూతన్.. పరాన్న జీవితో మాత్రం అందరి దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా ప్రత్యర్ధుల దృష్టిలో. దీంతో ఆయనపై నిఘా పెరిగింది. ఈ క్రమంలోనే తన ఇంట్లో జరిగిన శిరోముండనం కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో నూతన్కు ప్రత్యక్ష ప్రమేయం లేదు. ఈ ఘటన జరిగినప్పుడు ఆయన ఇంట్లోనే లేడు. ఆయన భార్య ప్రియా మాధురి ఆధ్వర్యంలోనే శిరోముండనం జరిగింది. కానీ అంతకు ముందే సీఎంవోలో పనిచేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో ఆయన చేసిన నకిలీ కాల్స్ శిరోముండనం తర్వాత కూడా కొనసాగడం ఆయన్ను పోలీసులకు పట్టించింది.
ఎరక్కపోయి ఇరుకున్న నూతన్...
వాస్తవానికి శిరోముండనం ఘటనతో ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఈ ఘటన జరుగుతున్న సమయంలో బయట ఉన్న నూతన్కు భార్య ప్రియా మాధురి దీన్ని వీడియో కాల్ ద్వారా లైవ్ చూపించింది. ఈ వ్యవహారంలోనూ పరోక్ష ప్రమేయం పేరుతోనే ఆయనపై కేసు నమోదయ్యేది. కానీ అక్కడితో ఊరుకుంటే ఆయన నూతన్ ఎందుకవుతాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి ఆస్పత్రులకు తరలించే లోపే కేజీహెచ్ డాక్టర్లు సుజాత, వాసుదేవ్లకు ఫోన్ చేసి తాను పీవీ రమేష్నని పరిచయం చేసుకుని పెందుర్తి నుంచి తనకు తెలిసిన వారు వస్తున్నారని వారిలో ఒకరిని కేజీహెచ్లో ఉంచాలని కోరారు. ఆ తర్వాత కేజీహెచ్ సూపరిండెంట్ పీవీ సుధాకర్కు ఫోన్ చేసి అక్కడకు వచ్చే తన మనిషిని రెండు వారాల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని సూచించారు. అక్కడే ఆయన దొరికిపోయాడు.
పీవీ సుధాకర్ ఫోన్ కాల్...
కేజీహెచ్ సూపరిండెంట్ పీవీ సుధాకర్కు పీవీ రమేష్ పేరుతో నూతన్ నాయుడు ఫోన్ చేసిన తర్వాత సరేనని ఫోన్ పెట్టేశారు. అనంతరం ఆయనకు నేరుగా పీవీ రమేష్తో పరిచయం ఉండటంతో ఫోన్ చేశారు. మీ వాళ్లు వస్తున్నారంటూ ఫోన్ వచ్చిందంటూ ఆయన చెప్పగానే పీవీ రమేష్ ఆశ్చర్యపోయారు. వెంటనే విశాఖ పోలీసు కమిషనర్ను అప్రమత్తం చేశారు. దీంతో వారు నూతన్పై నిఘా పెట్టారు. దీంతో ఆయన భార్యకు చేసిన ఓ ఫోన్ కాల్ను గుర్తించి ఆయన లోకేషన్ ఆధారంగా కర్నాటకలోని ఉడుపిలో అరెస్ట్ చేసి స్ధానిక కోర్టులో ప్రవేశపెట్టడం, ట్రాన్సిట్ వారెంట్పై విశాఖకు తరలించడం చకచకా జరిగిపోయాయి. దీంతో బాధితులకు సాయం చేసేందుకు నూతన్ చేసిన ఫోన్ కాల్ ఆయన్ను అంత కంటే పెద్దదైన చీటింగ్ కేసుల్లో పట్టించింది.
Recommended Video
ట్రూకాలర్ పట్టించిందిలా...
పీవీ రమేష్ పేరుతో నూతన్ నాయుడు చేసిన అరాచకాలకు ప్రత్యక్ష సాక్ష్యం ట్రూకాలర్ యాప్. ట్రూకాలర్లో తన పేరును పీవీ రమేష్, సీఎంవో పేరుతో సేవ్ చేసుకోవడం, ఈ ఫోన్తో జనానికి కాల్స్ చేసి తన పనులు చక్కబెట్టుకోవడం నూతన్ నాయుడు అలవాటుగా మార్చుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా ట్రూకాలర్ వాడి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 30 మంది అధికారులను నూతన్ మోసం చేసినట్లు వారు గుర్తించారు. శిరోముండనం ఘటన తర్వాత నూతన్ విశాఖ నంచి హైదరాబాద్, అక్కడి నుంచి బెంగళూరు, ఆ తర్వాత మంగళూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి తొమ్మిదిన్నరకు ఉడిపి రైల్వేస్టేషన్లో నూతన్ను అరెస్ట్ చేశారు. విశాఖకు రాగానే ఆయన్ను స్ధానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీ కోరే అవకాశముంది.