విశాఖలో గురు శిష్యుల మధ్య ఆసక్తికర పోరు: మంత్రి అవంతి వర్సెస్ మాజీ మంత్రి గంటా
టీడీపీలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న ఆయన పరి మారాలని ఊగిసలాడారు. కానీ గంతాకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పలంటే అటు అధికార పార్టీ , లేకుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలోనే ఉండాలని నిర్ణయం తీసుకుని రూటు మార్చుకున్నారు. వై సీపీ లోకి వెళ్ళాలంటే గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు. దీంతో గంటా యూ టర్న్ తీసుకుని స్థానికంగా విశాఖ మీద పట్టు నిలుపుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు . దీంతో మంత్రి అవంతి వర్సెస్ గంటా శ్రీనివాసరావు అన్నట్టు విశాఖలో రాజకీయం వేడెక్కుతుంది.
టీడీపీలోనే కొనసాగాలనుకున్న గంటా శ్రీనివాసరావు
గంటా శ్రీనివాసరావు తన శిష్యుడు మంత్రిగా ఉన్న చోట తాను తక్కువ పొజీషన్ లో ఉండటానికి ఇష్టపడరు . వైసీపీలో చేరితే ఎమ్మెల్యే గిరీ కూడా పోతుంది. మళ్ళీ పోటీ చేసి గెలుస్తారా లేదా అనేది డౌటే . అందుకే వైసీపీకి నో అనుకున్నారు . ఇక వేరే పార్టీలు అంటే ఏపీలో చక్రం తిప్పగల పార్టీలు ఇంకా వేరే ఏమీ లేవు. ఇక ఈ సమయంలో గంటా సడన్గా తన నిర్ణయం మార్చుకున్నారు . టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్న గంటా ఇప్పుడు పక్కా క్లారిటీతో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
విశాఖపట్నంలో గురు శిష్యుల మధ్య ఆధిపత్య పోరు
ఇక విశాఖపట్నం జిల్లాలో ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న తన శిష్యుడు, మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చెక్ చెప్పేందుకు గంటా శ్రీనివాస్ రావు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇక గంటాకు చెక్ పెట్టటానికి అవంతి కూడా బాగానే ప్రయత్నం చేస్తున్నారు . కావాలనే గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్న నియోజకవర్గంలో కావాలని అభివృద్ధికి పెద్ద పీట వేసి పలు కార్యక్రమాలు స్వయంగా నిర్వహిస్తున్నారు అవంతి శ్రీనివాస్ .
Recommended Video
గంటా నియోజకవర్గంపై మంత్రి దృష్టి .. రీజన్ ఇదే
ఇక స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నియోజక వర్గ అభివృద్ధి పట్టించుకోవటం లేదని , రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవంతి ప్రయత్నం చేస్తున్నారు . నియోజకవర్గానికి గంటా వచ్చినప్పుడు నిలదీయాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇక, నియోజకవర్గంలో గంటాపై ఓడిపోయిన కేకే రాజు తన ఉనికి కోసం పోరాడుతున్నారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన రాజు సైతం మళ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఇదే సమయంలో మంత్రి అవంతి డామినేషన్ రాజుకు స్థానికంగా ఉన్న పట్టును తగ్గిస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గురు శిష్యులిద్దరూ పోటీ పడుతున్నారు .అటు గంటా , ఇటు అవంతి ఇద్దరూ స్థానికంగా పట్టు నిలుపుకోవాలని ఎత్తులు వేస్తున్నారు. తాజాగా 300మంది బీజేపీ నేతలను గంటా టీడీపీ తీర్ధం పుచ్చుకునేలా చేశారు . ఇక గ్రేటర్ మేయర్ పీఠాన్ని జగన్కు గిఫ్ట్ ఇవ్వాలని అన్ని వార్డుల్లో వైసీపీ నేతలు ఇప్పటి నుండే తిరుగుతూ ఎన్నికల కసరత్తులు చేస్తుంటే గంటా మాత్రం బయటకు రాకుండా సైలెంట్ గా పనులను చక్కబెడుతున్నారు. మొత్తానికి విశాఖలో గురుశిష్యుల మధ్య వార్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది .