ఇంట్రెస్టింగ్ : అప్పుడెప్పుడో.. మళ్లీ ఇప్పుడు.. రెండు సార్లు తీరం దాటిన "పెథాయ్"
Recommended Video
విశాఖపట్నం : అల్లకల్లోలం చేసి వెళ్లిపోయిన పెథాయ్ తుపాను అరుదైన ప్రత్యేకత సొంతం చేసుకుంది. రెండు సార్లు తీరం దాటి ఔరా అనిపించుకుంది. సాధారణంగా ఏ తుపాను ఐనా ఒకేసారి తీరం దాటి వెళ్లిపోతాయి. అయితే పెథాయ్ తుపాను కాకినాడ సమీపంలో కాట్రేని కోన - యానాం మధ్య సోమవారం మధ్యాహ్నం మొదటిసారి తీరం దాటింది. తుని దగ్గర రాత్రి మరోసారి తీరం దాటి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సముద్ర తీర ప్రాంతాల్లో తుపాన్లు భూమిని తాకుతుంటాయి. భూ ఉపరితలంపై కొద్ది దూరం ప్రయాణించాక అవి బలహీనపడిపోతాయి. అయితే పెథాయ్ తుపాను మాత్రం భిన్నమైన పరిస్థితులు క్రియేట్ చేసింది. సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి తీరాన్ని తాకిని పెథాయ్ తుపాను దిశను మార్చుకుని సముద్రగర్భంలోకి వెళ్లిపోయింది. సోమవారం సాయంత్రం 5.00 - 5.30 గంటల సమయంలో పెథాయ్ తుపాను కాకినాడ సమీపంలో కేంద్రీకృతమై ఉంది. తీరా రాత్రి సమయంలో తుని దగ్గర మరోసారి తీరం తాకడం విశేషం.
పెథాయ్ తుపాను రెండు సార్లు తీరం దాటడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలా ఒక్క తుపాను రెండుసార్లు తీరం దాటడం చాలా అరుదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అప్పుడెప్పుడో 1970ల్లో ఇలాంటి ఘటన జరిగిందని చెబుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇలా జరుగుతుందని అంటున్నారు. అయితే భౌగోళిక పరిస్థితుల కారణంగానే ఒక్క తుపాను రెండు సార్లు తీరం దాటుతుందంటున్నారు. కాకినాడ-యానాం మధ్య భూమి U ఆకారంలో సముద్రంలోనికి చొచ్చుకుని ఉండి తిరిగి బయటకు వచ్చే తీరుగా ఉంటుందట. దీంతోనే పెథాయ్ తుపాను రెండు సార్లు తీరం దాటినట్లు తెలుస్తోంది.