విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన విశాఖ ఎమ్మెల్యేలు- పిలిపించి క్లాస్ పీకిన జగన్
విశాఖలో భూములు, నాడు-నేడు పనుల వ్యవహారాల్లో నెలకొన్న విభేధాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో పార్టీ ఆధినేత జగన్ వారిపై సీరియస్ అయ్యారు. తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
విశాఖపట్నంలో తాజాగా నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో వైసీపీకి చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తమ పార్టీకే చెందిన సీనియర్ నేత, జిల్లా ఇన్ఛార్జ్ కూడా అయిన ఎంపీ విజయసాయిరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగారు. సాయిరెడ్డి పేరు నేరుగా ప్రస్తావించకపోయినా విశాఖ జిల్లాలో భూములు, నాడు-నేడు వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయన్ను టార్గెట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో హాట్టాపిక్గా మారింది.
విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డిపై బహిరంగ విమర్శలకు దిగిన విషయం సీఎం జగన్కు చేరింది. దీంతో ఆయన ఇవాళ తన క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ సాయిరెడ్డిని కూడా పిలిపించారు. విమర్శలకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీగా ఉంటూ అభివృద్ధి పనులపై బహిరంగ విమర్శలకు దిగడం సమంజసం కాదని వారికి జగన్ క్లాసు పీకినట్లు తెలుస్తోంది. విశాఖ రాజధానిగా మారుతున్న వేళ పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని వారికి సూచించారు.