పరవాడ వద్ద తీవ్ర ఉద్రిక్తత: జనసేన సీనియర్ నేత అరెస్టు: అడ్డుకున్న కార్యకర్తలు..పోలీసులతో
విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని పరవాడ ఫార్మాసిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విష వాయువులు వెలువడి ఇద్దరు ఉద్యోగుల మరణానికి కారణమైన సాయినార్ లైఫ్ సైన్సెస్ సంస్థను సందర్శించడానికి బయలుదేరి వెళ్లిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి కోన తాతారావును పోలీసులు అడ్దుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మాసిటీని సందర్శించడానికి ఎవరికీ అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేయడంతో ఆయన అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విశాఖలో మరోసారి విష వాయువు లీక్: ఇద్దరు మృతి: నలుగురికి గాయాలు: పలువురికి అస్వస్థత
ఫార్మాసిటీ వద్ద ఉద్రిక్తత..
పోలీసుల తీరుకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రదేశం హోరెత్తిపోయింది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో విష వాయువులు వెలువడటం వల్ల ఇద్దరు ఉద్యోగులు మరణించిన విషయం తెలిసిందే. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆ కార్మికుడిని డాక్టర్లు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ర్యాలీగా బయలుదేరి వెళ్లిన నేతలు..
ఈ ఘటన అనంతరం పోలీసులు ఫార్మాసిటీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సాయినార్ లైఫ్ సైన్సెస్ సంస్థను షట్డౌన్ చేశారు. ఫార్మాసిటీలోని ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతర కార్మికులను తప్ప వేరొకరిని లోనికి ప్రవేశించడానికి అనుమతించట్లేదు. ఈ పరిస్థితుల్లో సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి కోన తాతారావు తన అనుచరులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరవాడ ఫార్మాసిటీకి బయలుదేరి వెళ్లారు. గాజువాక నుంచి ర్యాలీగా వారు ఫార్మాసిటీ వద్దకు తరలివెళ్లారు.
కోన తాతారావును అడ్డుకున్న పోలీసులు..
వారిని ఫార్మాసిటీ వద్దే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని, వెనక్కి తిరిగి వెళ్లాలని సూచించారు. పోలీసుల మాటలను ఆయన పట్టించుకోలేదు. ఫార్మాసిటీలోనికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముందుకు వెళ్లనివ్వలేదు. రోప్ పార్టీని మోహరిపంజేశారు. పోలీసుల చర్యకు నిరసనగా కోన తాతారావు అక్కడే బైఠాయించారు. పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరెస్టు.. పరవాడ పీఎస్కు తరలింపు..
ఆయనను వెనక్కి వెళ్లాలంటూ పోలీసులు పలుమార్లు విజ్ఙప్తి చేసినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో కోన తాతారావును పోలీసులు అదుపులోకి ప్రయత్నించారు. దీన్ని పసిగట్టిన పోలీసులు పోలీసులను అడ్డుకున్నారు. కోన తాతారావుకు వలయంగా నిల్చున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా తమ నినాదాలను కొనసాగించారు. పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఆయనను అరెస్టు చేయడానికి ముందుకు దూసుకుని వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పరవాడ ఏరియా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది.