టీడీపీతో పొత్తు అనుమానాలే కొంప ముంచాయి: పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టమ్: తేల్చిచెప్పిన జనసేన నేతలు
విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల తెర తీశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయాన్ని చవి చూడటానికి గల కారణాలపై పోస్ట్ మార్టమ్ మొదలు పెట్టారు. ఇదివరకే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, కృష్ణా జిల్లాలోని విజయవాడ లోక్ సభ స్థానాలు, వాటి పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లల్లో పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. మూడో విడతగా విశాఖపట్నం, అనకాపల్లి లోక్ సభ స్థానాలపై దృష్టి పెట్టారు. సోమవారం ఉదయం ఆయన సమీక్ష సమావేశాలను నిర్వహించారు.
ఓటమిపై పోస్ట్ మార్టమ్..
ఇసుక కొరత ఏర్పడటం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణమని ఆరోపిస్తూ.. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి వచ్చిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నంలోనే ఉన్నారు. ఈ ఉదయం విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి నాదెండ్ల మనోహర్, జనసేన లోక్ సభ అభ్యర్థి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ సహా పలువురు నేతలు హాజరయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు.
టీడీపీతో పొత్తు అనుమానాలే కొంప ముంచాయా?
మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ.. వాటిని సొమ్ము చేసుకోలేకపోయామంటూ జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కల్యాణ్ వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారని, ఆ పార్టీతో అనధికారికంగా పొత్తు కొనసాగుతోందనే అనుమానాలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశాయనే అనుమానాలు ప్రజల్లో బలంగా నాటుకుని పోయాయని అన్నారు. ఈ సందేహాలను తొలగించడంలో పార్టీ అగ్ర నాయకత్వం విఫలమైందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను తాము ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ప్రస్తావించి ఉంటే ఫలితాలు కొద్దో, గొప్పో సానుకూలంగా ఉండేవని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఎన్నికల ప్రచార వ్యూహాలు బెడిసి కొట్టాయంటూ..
ఎన్నికల ప్రచార వ్యూహాలు, వేసిన ఎత్తులు ప్రజల్లో పార్టీ నాయకత్వంపై అభిమానాన్ని ప్రోది చేయలేకపోయాయని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీని వదిలి పెట్టి ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రూపొందించారని, అక్కడే పార్టీ పరాజయానికి బీజం పడిందని కొందరు అభ్యర్థులు పవన్ కల్యాణ్ సమక్షంలో కుండబద్దలు కొట్టారని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని తాము అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ..ఎన్నికల ప్రచార వ్యూహాల్లో అప్పటికప్పుడు మార్పులు చేయలేకపోయారని, పొరపాట్లను సరిదిద్దుకోలేకపోయారని స్పష్టం చేసినట్లు సమాచారం.
చంద్రబాబు గాజువాకలో ప్రచారానికి రాకపోవడం కూాడా..
తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గాజువాక నియోజకవర్గంలో పర్యటించకపోవడం పెద్ద విఘాతంలా పరిణమించిందని కొందరు అభ్యర్థులు తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తోన్న నియోజకవర్గంలో మరో పార్టీ అధినేత తన అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టకపోవడం.. ఓటర్లకు ప్రతికూల సంకేతాన్ని పంపించిందని అన్నారు. చంద్రబాబుతో లోపాయకారి ఒప్పందం కుదరడం వల్లే పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా, తమ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఆయన ప్రచారానికి రాలేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని, అది ఎన్నికల ఫలితాల్లో ప్రస్ఫూటించిందని చెప్పారు.
బాలరాజు రాజీనామాపైనా చర్చ..
అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జనసేన పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పసుపులేటి బాలరాజు హఠాత్తుగా రాజీనామా చేసిన విషయం కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఉనికిని నిలుపుకోవాలంటే జనసేన పార్టీ సరైన వేదిక కాదనే అభిప్రాయం బాలరాజులో వ్యక్తమైందని, అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారని, రాజీనామా చేస్తారనే సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఇంత త్వరగా దాన్ని అమలు చేస్తారని భావించలేదని విశాఖపట్నం జిల్లా నాయకులు పవన్ కల్యాణ్ కు వివరించారు.