KA PAUL :మళ్లీ తెరపైకి కేఏ పాల్- విశాఖ ఉక్కు ఉద్యమంలోకి- హైకోర్టులో పిటిషన్
ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు సాగుతుండగా.. ఇందులోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఎంటరయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాల్లో అంతగా యాక్టివ్గా కనిపించని కేఏ పాల్ మరోసారి ఏపీ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఆయన.. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్ నిర్ణయాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో కేఏ పాల్ పిటిషన్ను హైకోర్టు త్వరలోనే విచారించే అవకాశముంది. ఈ పిటిషన్లో కేఏ పాల్ పలు కీలక అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్లో కేఏ పాల్ కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం ఔచిత్యాన్ని ప్రశ్నించారు. కేంద్రం దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రభుత్వ రంగ సంస్దలను నష్టాల సాకుతో పెట్టుబడుల ఉపసంహరణకు ఎంపిక చేసుకోవడాన్ని కేఏ పాల్ తప్పుబట్టారు. కేంద్రం చర్యలతో విశాఖ ఉక్కు ప్లాంట్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పాల్ పేర్కొన్నారు. కాబట్టి విశాఖ ప్లాంట్లో పెట్టుబడులను ఉపసంహరించకుండా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కేఏ పాల్ హైకోర్టును కోరారు.