కోడెల పేరుతో రాజకీయాలు ఏంటీ ? టీడీపీ, వైసీపీ నేతల తీరుపై కన్నా ఫైర్
విశాఖపట్టణం : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను రాజకీయం చేయడం తగదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. కోడెల శివప్రసాద్ పేరుతో అధికార, విపక్షాల విమర్శ-ప్రతి విమర్శలు సరికాదన్నారు. ఇరుపార్టీ నేతలు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే ప్రజలకు చెడు సంకేతాలు వెళతాయన్నారు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను ఏపీలో ప్రధాన పార్టీలు రాజకీయ చేయడం సరికాదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఇరు పార్టీల నేతల సంయమనం పాటించాలని కోరారు. ఆయన ఆత్మహత్యకు గల కారణం పోలీసు దర్యాప్తులో తేలుతుందన్నారు. మరోవైపు ఏపీ సీఎం జగన్పై కూడా విమర్శలు గుప్పించారు కన్నా లక్ష్మీనారాయణ. పదవీ చేపట్టిన మూడునెలల్లోనే భయపడినట్టు కనిపిస్తోందన్నారు.
విపక్ష నేతలను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని సూచించారు. పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. విపక్షాలు సభలు, సమావేశాలు, పర్యటనలు చేపడితే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేదంటే వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు.