కేసీఆర్ కు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు.. శారదపీఠంలో పూర్ణకుంభంతో స్వాగతం
విశాఖ : తెలంగాణ సీఎం కేసీఆర్ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబసభ్యులతో చినముషిడి వాడలోని శారదా పీఠానికి వెళ్లిన కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అక్కడి ప్రతినిధులు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అక్కడి ఆవరణలోని విజయ హనుమాన్ విగ్రహానికి, అలాగే శమీ చెట్టుకు పూజలు చేశారు. మధ్యాహ్న భోజనం ఆశ్రమంలోనే చేశారు.
అక్కడి నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లి ప్రత్యేక విమానంలో ఒడిశాకు బయలుదేరారు. సాయంత్రం 6 గంటలకు భువనేశ్వర్ లో సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీకానున్నారు. ఆదివారం రాత్రి నవీన్ పట్నాయక్ ఆతిథ్యం స్వీకరించి ఆయన ఇంట్లోనే బస చేయనున్నారు.
విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్ కు ఘనస్వాగతం లభించింది. కేసీఆర్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కొందరు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు అభివాదం చేశారు. కొన్నిచోట్ల కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ పెద్దసంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.