ఆటోలపై జగన్ ఫోటోలు పెడితే ఆర్టీఏ అధికారులు ఏమనరట.. మంత్రి అవంతి షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ఏలూరులో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మంత్రులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆటోవాలాలకు జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేలు అందించే కార్యక్రమం చేపట్టి ఆటోలు, ట్యాక్సీలు నడిపే డ్రైవర్లకు చేయూతనందించారు. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.10వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ఈ పథకాన్ని ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో సీఎం జగన్ ప్రారంభించారు .
మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై కస్సుమన్న ద్రోణంరాజు శ్రీనివాస్..ఇద్దరూ వైసీపీ నేతలే..ఎందుకిలా?
ఇక ఇదే సమయంలో విశాఖలో వైఎస్ ఆర్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి అవంతి శ్రీనివాస్ . వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జగన్ ఆటోవాలాలకు, ట్యాక్సీ వాలాలకు ఆర్ధిక చేయూత అందించటం వారి పట్ల జగన్ కు ఉన్న ఉదార దృష్టికి నిదర్శనం అన్నారు. దేశంలో ఇంకెక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆటోవాలాలకు, ట్యాక్సీ వాలాలకు భరోసా ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పత్రాలను అందజేశారు. కేవలం విశాఖలోనే 25 వేల మంద్రి డ్రైవర్లకు ఈ పథకం ద్వారా సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు.
ఇక అంతే కాకుండా ఆటోలపై జగన్ ఫొటోలను పెట్టుకోవాలని సూచించారు మంత్రి అవంతి శ్రీనివాస్. జగన్ ఫొటో పెట్టుకున్నందుకు ఆర్టీఏ అధికారులెవరూ ఇబ్బంది పెట్టరని మంత్రి పేర్కొన్నారు . ఈ వ్యాఖ్యలు విన్న వారు అవాక్కయ్యారు . ఆటోల మీద జగన్ ఫోటోలు పెట్టుకోటానికి, ఆర్టీఏ అధికారులు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి గల లింక్ ఏమిటో అర్ధం కాక అయోమయంగా చూసారు. జగన్ ఫోటో ఉంటే వాహనదారులకు అన్ని పత్రాలు లేకున్నా , ఎలా పడితే అలా డ్రైవ్ చేసినా నడుస్తుందా అని మంత్రి వర్యుల మాటలు విన్న వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఆటోవాలాలు జగన్ ఫోటో పెట్టుకుని ఆర్టీఏ అధికారుల మీదే రుబాబు చెయ్యరు కదా అని కొందరు చర్చించుకుంటున్నారు .