విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన కేసు విచారణ .. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలన్న హైకోర్టు
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ సంఘటనపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అటు ఎల్జీ పాలైమర్స్ తరపున న్యాయవాదులు , ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు , అలాగే పిటీషనర్ తరపున న్యాయవాదులు ఆసక్తికర వాదనలు వినిపించారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఇప్పటివరకు జరిగిన అన్నిటినీ హైకోర్టుకు వివరించింది. ఇక దీంతో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది .
ఎన్జీటీ ఆదేశాలను, ఏడు కమిటీల ఏర్పాటును సవాల్ చేసిన ఎల్జీపాలిమర్స్ .. సుప్రీంలో ఆసక్తికర వాదన
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు ఆస్పత్రిపాలయ్యారు. ఇంకా సమీప గ్రామాల ప్రజలు కోలుకోలేదు . ఈ వ్యవహారంపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇక పిటీషనర్లు కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఇక ఈ ఆరోపణలకు ఎల్జీ పాలిమర్స్ సమాధానం ఇచ్చింది . ఇప్పటికే కంపెనీ డైరెక్టర్ల పాస్ పోర్టులు సరెండర్ చేశామని ఎల్జీ పాలిమర్స్ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు . ఇక అంతేకాదు అధికారుల ఆదేశాల మేరకు గ్యాస్ లీక్ అయిన ట్యాంక్ మినహా, మిగతా ట్యాంకుల్లో ఉన్న స్టైరీన్ను సౌత్ కొరియాకు తరలించామని నివేదికలో పేర్కొంది. ఇక ఎంజీటీ ఆదేశాల మేరకు 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామని , విచారణకు సహకరిస్తున్నామని ఎల్జీ పాలిమర్స్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది .
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ కోర్టులో 50 కోట్లు డిపాజిట్ చేశామని పేర్కొన్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ వ్యవహారంపై తొమ్మిది విచారణా సంస్థలు విచారణ జరుపుతున్నాయని, అన్ని విచారణా సంస్థల విచారణ అవసరమా అని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఇక ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ పై జరుగుతున్న తొమ్మిది విచారణా సంస్థల విచారణల గురించి కోర్టుకు వివరించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.