మెజిస్ట్రేట్ ముందుకు సౌత్ కొరియన్ సీఈఓతో సహా ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులు..22 వరకు రిమాండ్ విధింపు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈవో, డైరెక్టర్లు సహా 12 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ ఘటనపై విచారించడానికి హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాజాగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో, నివేదిక ఇచ్చిన 24 గంటల్లోపే వారిపై చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం.
అందులో భాగంగా ఎల్జీ పాలిమర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈవో సుంకి జియోంగ్ ,టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్ తదితరులను అరెస్ట్ చేసిన పోలీసులు నేడు 12 మంది నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఇక ఈ కేసు విషయంలో రిమాండ్ రిపోర్ట్ ను సిద్ధం చేసిన పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. ఈనెల 22వ తేదీ వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు గా పేర్కొన్నారు. రిమాండ్ నేపథ్యంలో వీరిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఏపీ సర్కార్ చాలా సీరియస్ గా ఉందని తాజా పరిణామాలతో స్పష్టం అవుతుంది. ఒకవైపు కంపెనీ సీఈవో, కీలకమైన ఇద్దరు డైరెక్టర్లతో సహా 12 మందిని పోలీసులు అరెస్టు చెయ్యటం , అందులో ఒక విదేశీయుడైన సిఈఓ అరెస్ట్ దేశంలో ఇదే ప్రధమమని వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో పారదర్శకంగా ఉందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు . 12 మందిని బాధ్యులుగా గుర్తించి అరెస్ట్ చేసే లోపే మరోవైపు ప్రభుత్వం ముగ్గురు అధికారులపై కూడా వేటు వేయటం గమనార్హం .