విశాఖకు చేరుకున్న ఎల్జీ పాలిమర్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ .. 8 మంది సభ్యులతో ఘటనపై విచారణ
విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన దుర్ఘటన విషయంలో దక్షిణ కొరియాలోని సంస్థ స్పందించిన విషయం తెలిసిందే . విశాఖ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బాధితులందరికీ అవసరమైన వైద్య సహాయం అందజేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి అకస్మాత్తుగా వెలువడిన విషవాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని ఎల్జీ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే .
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై కేంద్రానికి, రాష్ట్రానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
ఇక బాధితులు, మరణించిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్టు ఎల్జీ పాలిమర్స్ వెల్లడించింది. ఇక ఇప్పుడు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కూడిన తమ టాస్క్ ఫోర్స్ బృందం విశాఖ నగరానికి చేరినట్టు తెలిపింది. ఈ టాస్క్ఫోర్స్ ఎల్జీ పెట్రో కెమికల్స్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఇది మొత్తం ఘటనపై అధ్యయనం చేస్తుందని పేర్కొంది. ఇక ఈ బృందంలో అన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఉత్పత్తి, పర్యావరణం , భద్రత రంగాలకు చెందిన నిపుణులు అధ్యయన బృందంలో ఉన్నారు. ప్రమాదంపై పూర్తి అధ్యయనం చేసి కారణాలను వారు విశ్లేషిస్తారు. దాని ఆధారంగా నివేదిక తయారు చేసి సంస్థకు అప్పగిస్తారు.
ఇక ఇదే సమయంలో బాధిత గ్రామాలను సందర్శిస్తారు. బాధిత గ్రామాల ప్రజలకు పునరావాసంలో ఏం చేయ్యాలో నిర్ణయించనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వారికి సంబంధించి సంరక్షణా ప్యాకేజ్ లను నిర్ణయించనున్నారు . ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా సమావేశం కానున్నారు. బాధితులకు అందించే సాయంపై వివరించనున్నారు. ఇక స్థానిక ప్రజల రక్షణ కోసం వెంటనే అమలు చేయగల సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి కూడా ఈ టాస్క్ ఫోర్సు నిర్ణయం తీసుకోనుంది . ఇక అక్కడి స్థానికులకు దోహదపడేలా మధ్య, దీర్ఘకాలిక సపోర్టింగ్ కార్యక్రమాలు చేపట్టటానికి కూడా నిర్ణయం తీసుకుంటుంది ఈ టాస్క్ ఫోర్సు .