ముందు ప్రియురాలు.. తర్వాత ప్రియుడు.. ప్రేమికులరోజుకు రెండు రోజుల ముందు విషాదం..
ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందు ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. మొదట ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడగా.. ఆమె ఇక లేదన్న విషయం తెలుసుకుని ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆత్మహత్యకు కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. పెళ్లి చేస్తామని తాము హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇలా బలవన్మరణానికి పాల్పడటం వారి తల్లిదండ్రులను కలచివేస్తోంది.
అసలేం జరిగింది..
విశాఖపట్నం కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని యలమంచలి రామ్నగర్కి చెందిన మక్క శిరీష(20), అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్(22)తో ప్రేమలో పడింది. నాలుగేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తెలిసింది. దీంతో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. పెళ్లి కూడా చేస్తామని హామీ ఇచ్చారు.
ఆరోజు సాయంత్రం ఫోన్ కాల్..
కొన్ని నెలల క్రితం శిరీష కుటుంబం గోపాలపట్నం వచ్చేసింది. స్థానికంగా ఓ రెస్టారెంట్ నడుపుతూ.. అదే భవనంలో నివసిస్తున్నారు. శిరీష తండ్రి ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. గోపాలపట్నం వచ్చిన తర్వాత కూడా శిరీష రెగ్యులర్గా వెంకటేశ్తో ఫోన్లో మాట్లాడేది. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం కూడా ఎప్పటిలాగే వెంకటేశ్,శిరీష ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రెస్టారెంట్ కౌంటర్ వద్ద ఉన్న శిరీష.. ఉన్నట్టుండి మేడ పైకి పరిగెత్తింది.
శిరీష ఆత్మహత్య..
ఫోన్ కాల్ మాట్లాడుతున్న సమయంలో వెంకటేశ్,శిరీష మధ్య ఏదో విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఫోన్ పట్టుకుని మేడ పైకి పరిగెత్తింది. తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని.. తాను చనిపోతున్నట్టు వెంకటేశ్కు మెసేజ్ చేసింది. అదే మెసేజ్ వెంకటేశ్ శిరీష సోదరికి పంపించాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆమె శిరీష గదిలోకి వెళ్లి చూసేసరికి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది.
ఆ విషయం తెలిసి వెంకటేశ్ కూడా ఆత్మహత్య..
శిరీష ఆత్మహత్య చేసుకుందన్న విషయం వెంకటేశ్ను తీవ్రంగా కలచివేసింది. శిరీష లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. కంచరపాలెం బర్మా క్యాంపు సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పెళ్లి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారోనని ఇరువురు కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇద్దరి ఆత్మహత్యలపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.