విశాఖలో విషాదం! ప్రేమికుల ఆత్మహత్యాయత్నం! బాదంపాలులో పురుగుల మందు
విశాఖపట్నం: ప్రముఖ పర్యాటక నగరంగా పేరుపొందిన విశాఖపట్నంలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారణాలేమిటో స్పష్టంగా తెలియరావట్లేదు గానీ.. ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. బాదంపాలులో పురుగుల మందు కలుపుకొని సేవించి, ఆత్మహత్య ప్రయత్నం చేశారు ప్రేమికులు. ఈ ఘటనలో ప్రియుడు మరణించాడు. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం శివార్లలోని కైలాసగిరి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను సత్యనారాయణ, కమలగా గుర్తించారు పోలీసులు. సంఘటనాస్థలం నుంచి పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ నగరంలో బీచ్ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాస గిరి. సెలవురోజు కావడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కైలాసగిరికి కొద్ది దూరంలో ఓ పార్కులో సత్యనారాయణ, కమల స్పృహ తప్పిన స్థితిలో కనిపించారు. వారిని గమనించిన వెంటనే కొందరు సందర్శకులు ఈ సమాచారాన్ని అరిలోవా పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని పరిశీలించగా.. సత్యనారాయణ నిర్జీవంగా కనిపించాడు. కమల కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించి, అంబులెన్స్ను పిలిపించి, హుటాహుటిన కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో కమలకు చికిత్స అందిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సిహెచ్.సత్యనారాయణ, రౌతు కమలలు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కమల హ్యాండ్బ్యాగులో సూసైడ్ నోట్ లభ్యమైంది. 'కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలనేది మా కోరిక. కానీ మాకా అదృష్టం లేదు. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇదే నా చివరి కోరిక' అంటూ కమల రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.