బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్: చివరి రౌండ్ లో భారీ వర్షాలు..
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో విడత భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరీలల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం అంచనా వేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శనివారం భారీగా వర్షం కురిసింది. తీర ప్రాంత జిల్లాలపైనా అల్పపీడన ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి.
నెల్లూరు జిల్లాలోనూ ఇదే తరహా వాతావరణం నెలకొని ఉంది. ఈశాన్య రుతుపవానాల ప్రభావానికి.. అల్పపీడన ద్రోణం తోడైందని ఫలితంగా వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.
కర్ణాటక, తమిళనాడ, పుదుచ్చేరిలపైనా అల్పపీడన ద్రోణం ప్రభావం కనిపిస్తోంది. బెంగళూరు సహా తీర ప్రాంత జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మంగళూరు, భత్కల్, ఉడుపి వంటి కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ ఉత్తర ప్రాంత జిల్లాలు, లక్షద్వీప్ లల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.